ఐపీఎల్ 2025 మెగా వేలంలో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ సరికొత్త రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా పంత్ రికార్డ్ సాధించాడు. సౌదీ అరేబియాలో జడ్డా వేదికగా జరిగిన మెగా వేలంలో రిషభ్ పంత్ను రూ. 27 కోట్ల భారీ ధరకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
మెగా వేలంలో రిషభ్ పంత్ కోసం ఫ్రాంచైజీలు పోటీపడగా.. లక్నో సూపర్ జెయింట్స్ రూ.20.75 కోట్లకు బిడ్ వేసి దక్కించుకుంది. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్.. పంత్ కోసం ఆర్టీఎమ్ కార్డ్ను ఉపయోగించింది. దాంతో లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా అందరి కళ్లు చెదిరేలా రూ. 27 కోట్ల రికార్డ్ ధరకు బిడ్ వేసాడు. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్ వెనకడుగు వేసింది.

ఢిల్లీ వ్యూహాన్ని పసిగట్టే రికార్డ్ ధర..
ఫ్రాంచైజీల ఊహకు అందని ధరను సంజీవ్ గోయెంకా బిడ్ వేయడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పంత్ ధరను అమాంతం పెంచడానికి గల కారణాన్ని సంజీవ్ గోయెంకా వెల్లడించారు. ఢిల్లీ క్యాపిటల్స్ కో-ఓనర్ పార్థ్ జిందాల్ ఉద్దేశాన్ని పసిగట్టే రికార్డ్ ధరకు బిడ్ వేసానని వివరణ ఇచ్చారు.
'ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్ పార్థ్ జిందాల్.. ఆర్టీఎమ్ ద్వారా రిషభ్ పంత్ను తీసుకునేందుకు ఆసక్తికనబర్చడాన్ని పసిగట్టి రూ. 27 కోట్ల రికార్డ్ ధరకు బిడ్ వేసాం. శ్రేయస్ అయ్యర్ కోసం రూ. 26.5 కోట్ల వరకు బిడ్ వేసిన పార్థ్ జిందాల్.. పంత్ కోసం రూ. 26.75 కోట్లు పెట్టగలడని భావించాం. అందుకే అతని ఊహకందని ధరకు బిడ్ వేసి రిషభ్ పంత్ను సొంతం చేసుకున్నాం.'అని సంజీవ్ గోయెంకా వివరణ ఇచ్చాడు.
పంత్ సమయస్ఫూర్తికి ఫిదా..
ఇక రిషభ్ పంత్పైనే ఆసక్తి చూపించడానికి గల కారణాన్ని కూడా సంజీవ్ గోయెంకా వెల్లడించాడు. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో మ్యాచ్ మూమెంటమ్ను దెబ్బతీసేలా పంత్ చూపిన సమయస్పూర్తి తనకు బాగా నచ్చిందన్నాడు. 'రిషభ్ పంత్ గాయం డ్రామాకు సంబంధించిన వీడియోను నేను చూశాను.
మ్యాచ్ మూమెంటమ్ను నెమ్మది చేశాడు. ఆ ప్రవర్తన నాకు బాగా నచ్చింది. పరిస్థితులన్నీ ప్రతీకూలంగా ఉన్నప్పుడు ప్యాడ్స్ తొలగించి మ్యాచ్ మూమెంటమ్కు బ్రేక్ వేయాలనే ఆలోచన రావడం అద్భుతం. ఆ క్షణమే రిషభ్ పంత్ను జట్టులోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నా.
మరో 10 ఏళ్లు లక్నోతోనే..
పంత్ సమయస్ఫూర్తితో పాటు ఘోర రోడ్డు ప్రమాదం నుంచి కోలుకోవడం, మునపటిలా సత్తా చాటడం కూడా నన్ను బాగా ఆకట్టుకుంది. ప్రతికూల పరిస్థితులకు పోరాడి నిలదొక్కుకోవడం గొప్ప విషయం. రిషభ్ పంత్ వయసు 27 ఏళ్లు మాత్రమే. లక్నోతో అతను మరో 10-12 ఏళ్లు కొనసాగుతాడు.'అని సంజీవ్ గోయెంకా స్పష్టం చేశారు.