ఐపీఎల్ 2025 సీజన్ను లక్నో సూపర్ జెయింట్స్(ఎల్ఎస్జీ) ఓటమితో ప్రారంభించింది. ఢిల్లీ క్యాపిటల్స్తో వైజాగ్ వేదికగా సోమవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో లక్నో ఒక్క వికెట్ తేడాతో ఓటమిపాలైంది. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్ను చేజేతులా చేజార్చుకుంది. కెప్టెన్ రిషభ్ పంత్ చేసిన తప్పిదాలు లక్నో సూపర్ జెయింట్స్ ఓటమిని శాసించాయి.
ఆఖరి ఓవర్లో ఢిల్లీ క్యాపిటల్స్ చివరి బ్యాటర్ మోహిత్ శర్మను స్టంపౌట్ చేసే అవకాశాన్ని రిషభ్ పంత్ చేజార్చాడు. ఈ స్టంపౌట్ చేసి ఉంటే ఢిల్లీ ఆలౌటై.. లక్నో గెలిచేది. మరోవైపు అషుతోష్ శర్మ(31 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లతో 66 నాటౌట్), విప్రజ్ నిగమ్(15 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 39) సంచలన బ్యాటింగ్తో ఢిల్లీ క్యాపిటల్స్ను గెలిపించారు. అనేక మలుపు తిరుగుతూ ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేసింది. ఓటమిని ఏ మాత్రం సహించని లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా.. ఈ సారి మాత్రం ఆటగాళ్లకు అండగా నిలిచాడు.

మ్యాచ్ అనంతరం ఢిల్లీ డగౌట్లో ఆటగాళ్లతో ప్రత్యేకంగా మాట్లాడాడు. ఈ మ్యాచ్లో ఓడినా.. అద్భుతమైన క్రికెట్ ఆడారని ఆటగాళ్లను మెచ్చుకున్నాడు. 'ఈ మ్యాచ్లో ఓడినా చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. జట్టు బ్యాటింగ్, బౌలింగ్.. ముఖ్యంగా పవర్ ప్లేలో ఆడిన విధానం అద్బుతం. కొన్నిసార్లు ఇలాంటి ఫలితాలు ఎదురవుతాయి. మనది యంగ్ టీమ్. సానుకూలంశాలను తీసుకొని తుదపరి మ్యాచ్కు సిద్దమవుదాం. 27న జరిగే మ్యాచ్లో మెరుగైన ఫలితాన్ని రాబడుదాం. ఈ ఓటమిని తీవ్రంగా నిరాశపరిచింది. కానీ ఇదో గొప్ప మ్యాచ్'అని సంజీవ్ గోయెంగా చెప్పుకొచ్చాడు.
మార్చి 27న లక్నో సూపర్ జెయింట్స్ తదుపరి మ్యాచ్ ఆడనుంది. ఉప్పల్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. ఇప్పటికే సన్రైజర్స్ హైదరాబాద్ భారీ విజయం సాధించి మంచి జోష్లో ఉంది. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన తొలి మ్యాచ్లో 286 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. లక్నో బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉన్నప్పటికీ.. గాయాలతో స్టార్ పేసర్లు దూరమవడంతో బౌలింగ్ విభాగం బలహీనంగా మారింది.