రాజస్థాన్ రాయల్స్ చిచ్చర పిడుగు, ఐపీఎల్ బుడ్డోడు వైభవ్ సూర్యవంశీపై టీమిండియా మాజీ క్రికెటర్ల, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రశంసల జల్లు కురిపించాడు. క్రికెట్లో వైభవ్ సూర్యవంశీ వండర్ భాయ్ అని కొనియాడాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో శనివారం జరిగిన మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ.. రాజస్థాన్ రాయల్స్ తరఫున అరంగేట్రం చేశాడు.
14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్లోకి అరంగేట్రం చేసిన ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్గా తరలించి అందర్నీ ఆశ్చర్యపరిచిన ఈ బిహార్ కుర్రాడు.. ఫియర్లెస్ గేమ్తో లక్నో బౌలర్లను చెడుగుడు ఆడాడు. తొలి మ్యాచ్ ఆడుతున్నాననే బెరుకు లేకుండా స్పిన్నర్లు, పేసర్లను అలవోకగా ఆడేసాడు. 14 ఏళ్ల వయసే అయినా.. తన ఆటలో ఎంతో మెచ్యూరిటీ చూపించాడు. 20 బంతుల్లో 2 ఫోర్లు 3 సిక్స్లతో 34 పరుగులు చేసి ఎయిడెన్ మార్క్రమ్ బౌలింగ్ స్టంపౌటయ్యాడు.

జియో హాట్స్టార్ ప్రోగ్రామ్లో సూర్యవంశీ గురించి ప్రత్యేకంగా మాట్లాడిన సంజయ్ మంజ్రేకర్.. అతనికి అవకాశం ఇచ్చిన రాజస్థాన్ రాయల్స్ జట్టును ప్రత్యేకంగా అభినందించాడు. 'తల్లిదండ్రులు తమ 30 లేదా 40 ఏళ్ల వయసులోనే ఇలా తమ పిల్లల అరంగేట్రాన్ని చూస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇది ఏ మాత్రం నమ్మశక్యం కానిది. వైభవ్ సూర్యవంశీ కొట్టిన తొలి రెండు సిక్స్లు అద్భుతమైన బంతులకు వచ్చినవే. స్పిన్నర్లను చాలా మెచ్యూరిటీగా ఆడాడు.
తన ఆటతో ప్రతీ ఒక్కరిని ఆకట్టుకున్నాడు. ఔటైనప్పుడు అతను ఏడ్చాడు. అతని వయసు అలాంటిది. అది సహజంగా వచ్చిన దు:ఖమే. ఈ కుర్రాడికి అవకాశం ఇచ్చిన రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్దే పూర్తి క్రెడిట్. అతనిపై నమ్మకం ఉంచి టాపార్డర్లో అత్యుత్తమ ప్లాట్ఫామ్ ఇచ్చింది. మరో లెఫ్టాండర్ ఉన్నా కూడా అతనితో కలిసి ఓపెనర్గా ఆడించింది. రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంటే ఈ వండర్ భాయ్ని ఆవిష్కరించింది.'అని సంజయ్ మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025 మెగావేలంలో ఈ కుర్రాడిని రాజస్థాన్ రాయల్స్ రూ. 1.10 కోట్లకు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ అవకాశాన్ని అతను అద్భుతంగా అందిపుచ్చుకున్నాడు.