బ్యాటింగ్తో పాటు బౌలింగ్ వైఫల్యం తమ ఓటమిని శాసించిందని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో శనివారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా విఫలమైన చెన్నై సూపర్ కింగ్స్ 25 పరుగుల తేడాతో చిత్తయ్యింది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన రుతురాజ్ గైక్వాడ్.. పవర్ ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోవడం తమ విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు. బౌలింగ్లోనూ 15-20 పరుగులు అదనంగా ఇచ్చినట్లు అంగీకరించాడు.
ఢిల్లీ బౌలర్లు అసాధారణ ప్రదర్శనతో తమ పతనాన్ని శాసించారని కొనియాడాడు. పరిస్థితులకు తగ్గట్లు బౌలింగ్ చేసి తమను దెబ్బ తీసారని తెలిపాడు. పవర్ ప్లేలో అతి జాగ్రత్తగా బ్యాటింగ్, బౌలింగ్ చేస్తుండటంతోనే హ్యాట్రిక్ పరాజయాలను ఎదుర్కొన్నామని అభిఫ్రాయపడ్డాడు.

'గత మూడు మ్యాచ్ల్లో మాకు ఏది కలిసి రాలేదు. మెరుగయ్యేందుకు మేం ప్రయత్నిస్తున్నా.. మాకు ఆశించిన ఫలితం దక్కడం లేదు. పవర్ ప్లేలోనే మేం కీలక వికెట్లు కోల్పోయాం. ఇదే మా పతనాన్ని శాసించింది. ఇది మేం ఆందోళన చెందాల్సిన విషయమే. బౌలింగ్లో కూడా మేం విఫలమవుతున్నాం. 15-20 పరుగులు అదనంగా ఇస్తున్నాం. లేదంటే పవర్ ప్లేలోనే ఎక్కువ వికెట్లు కోల్పోతున్నాం. మా బలహీనతలను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నాం. కానీ ఫలితం దక్కడం లేదు. పవర్ ప్లేలో మేం అతి జాగ్రత్తగా బ్యాటింగ్ చేయడంతో పాటు బౌలింగ్ చేస్తుండటం మాకు నష్టం కలిగిస్తోంది.
సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది. పవర్ ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోతుండటంతో గెలవాలనే ఇంటెంట్ చూపించలేకపోతున్నాం. ఈ మ్యాచ్లోనూ మేం విజయానికి చాలా దూరంగా నిలిచాం. ఒక్క బ్యాటర్ మాత్రమే క్రీజులో నిలిచిపోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. పిచ్ కండిషన్స్ను అద్భుతంగా ఉపయోగించుకుంది. శివమ్ దూబే బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మూమెంటమ్ లభిస్తుందని ఆశించాం. కానీ అలా జరగలేదు.'అని రుతురాజ్ గైక్వాడ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 183 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(51 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 77) హాఫ్ సెంచరీతో రాణించగా.. అభిషేక్ పోరెల్(20 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 33), ట్రిస్టన్ స్టబ్స్(11 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 22 నాటౌట్) దూకుడుగా ఆడారు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్(2/25) రెండు వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్, మతీష పతీరణ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 158 పరుగులే చేసి ఓటమిపాలైంది. విజయ్ శంకర్(54 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 69 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించగా.. ధోనీ(26 బంతుల్లో ఫోర్, సిక్స్తో 30) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఢిల్లీ బౌలర్లలో విప్రజ్ నిగమ్(2/27) రెండు వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.