ఐపీఎల్ 2025 మెగా వేలంలో రైట్ టు మ్యాచ్(RTM) నయా రూల్తో ఆటగాళ్ల పంట పండింది. సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ ఈ రూల్ను ప్రవేశ పెట్టిన భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ).. ఆటగాళ్ల సూచనల మేరకు కాస్త మార్చింది. ఈ మార్పు ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపించగా.. ఫ్రాంచైజీల కొంపముంచింది. ఈ క్రమంలోనే ఆర్టీఎమ్ రూల్పై 10 ఫ్రాంచైజీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. కొన్ని ఈ నయా రూల్ను స్వాగతిస్తే మరికొన్ని జట్లు వ్యతిరేకించాయి.
సోమవారం ముగిసిన మెగా వేలంలో ఆర్టీఎమ్ నయా రూల్ ద్వారా చాలా మంది ఆటగాళ్లకు భారీ ధర దక్కింది. టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ రూ. 27 కోట్ల భారీ ధర పలకడానికి కూడా ఆర్టీఎమ్ నయా రూలే ప్రధాన కారణం. ఆర్టీఎమ్ నయా రూల్ లేకుంటే పంత్ రూ. 20.75 కోట్లకే అమ్ముడుపోయేవాడు. టీమిండియా స్టార్ పేసర్ ముఖేష్ కుమార్(రూ. 8 కోట్లు), ఆర్ సాయి కిషోర్(రూ. 2 కోట్లు), షమర్ జోసెఫ్(రూ. 75 లక్షలు) ఆర్టీఎమ్ కారణంగానే ఎక్కువ మొత్తంలో డబ్బును దక్కించుకున్నారు.

రైట్ టు మ్యాచ్(ఆర్టీఎమ్) అంటే ఏమిటీ..?
మెగా వేలానికి వదిలేసిన తమ ఆటగాళ్ల నుంచి ఫ్రాంచైజీలు ఆర్టీఎమ్ కార్డ్ ద్వారా తిరిగి కొనుగోలు చేయవచ్చు. అయితే గతంలో ఈ రూల్ ప్రకారం.. ప్రత్యర్థి ఫ్రాంచైజీ బిడ్ వేసిన ధరను చెల్లించి జట్టులోకి తీసుకునేది. కానీ ఈ సారి బీసీసీఐ ఈ రూల్ను మార్చింది. బిడ్ వేసిన టీమ్కు సదరు ప్లేయర్ను తీసుకునేందుకు మరో అవకాశం ఇచ్చింది. మరోసారి బిడ్ వేసే వెసులుబాటు కల్పించింది. అప్పుడు ఆ ఆ ధరను చెల్లిస్తేనే ఆర్టీఎమ్ కింద తమ ఆటగాడిని ఫ్రాంచైజీ తీసుకోవచ్చు.
తాజా వేలంలో రిషభ్ పంత్ను రూ. 20.75 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది. అతని పాత జట్టు అయిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆ ధరకే ఆర్టీఎమ్ కార్డ్ ద్వారా తీసుకుంటామని చెప్పింది. నయా రూల్ ప్రకారం లక్నో సూపర్ జెయింట్స్కు బిడ్ వేసేందుకు మరో అవకాశం ఇవ్వగా.. ఆ జట్టు రూ. 27 కోట్లకు పెంచింది. దాంతో అంత డబ్బును చెల్లించుకోలేమని ఢిల్లీ చెప్పడంతో పంత్ లక్నో సొంతమయ్యాడు. ముఖేష్ కుమార్ వ్యవహారంలోనూ ఇదే జరిగింది.
ఫ్రాంచైజీలకు తీరని నష్టం..
ఆర్టీఎమ్ నయా రూల్ వల్ల ఫ్రాంచైజీలకు తీరని నష్టమని కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్.. మెగా వేలం సందర్భంగానే తెలిపాడు. ఈ రూల్ ద్వారా ఆటగాడి అసలు డిమాండ్ కంటే ఎక్కువ చెల్లించుకోవాల్సి వస్తుందని అభిప్రాయపడ్డాడు. ఈ రూల్కు తమ జట్టు వ్యతిరేకమని స్పష్టం చేశాడు. అందుకే తాము ఆర్టీఎమ్ కార్డ్ ఉపయోగించుకోలేదని స్పష్టం చేశాడు. ఈ క్రమంలోనే కేకేఆర్తో పాటు మెజార్టీ జట్లు ఆర్టీఎమ్ కార్డ్ను ఉపయోగించలేదు.