టాస్ ఓడిపోడం తమ పతనాన్ని శాసించిందని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తెలిపాడు. స్లో వికెట్పై బ్యాటింగ్ చేయడం కష్టమైందన్నాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో శనివారం జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 9 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన సంజూ శాంసన్.. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ అద్భుత బ్యాటింగ్తో తమ నుంచి మ్యాచ్ను లాగేసుకున్నారని తెలిపాడు. 'టాస్ ఓడిన తర్వాత స్లో వికెట్పై.. 170 పరుగులు మంచి స్కోర్. పవర్ ప్లేలో బ్యాటింగ్ చేయడం చాలా కష్టమైంది. సాల్ట్, కోహ్లీ చెలరేగుతారని మాకు తెలుసు. పవర్ ప్లేలోనే వాళ్లు మ్యాచ్ను గెలిచేసారు. క్యాచ్లు మేం డ్రాప్ చేశాం. వాళ్లు కూడా వదిలేసారు. కానీ మా కంటే వాళ్లు మెరుగ్గా బ్యాటింగ్ చేశారు.

ఈ గెలుపు క్రెడిట్ వారిదే. వారి ఇంటెంట్ మా కంటే బాగుంది. టాస్ గెలవడం కూడా వారికి కలిసొచ్చింది. ఈ మ్యాచ్ను 19, 20వ ఓవర్ వరకు తీసుకెళ్లాలనుకున్నాను. కానీ మేం తప్పిదాలు చేశాం. ఈ మ్యాచ్ను వీలైనంత త్వరగా మరిచిపోయి.. తదుపరి మ్యాచ్కు ఫ్రెష్గా రెడీ అవుతాం. ఆత్మవిశ్వాసంతో తిరిగి వస్తాం.'అని సంజూ శాంసన్ తెలిపాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 173 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(47 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్లతో 75) హాఫ్ సెంచరీతో రాణించగా.. రియాన్ పరాగ్(22 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 30), ధ్రువ్ జురెల్(23 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 35 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హజెల్ వుడ్, కృనాల్ పాండ్యా తలో వికెట్ తీసారు.
అనంతరం ఆర్సీబీ 17.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 175 పరుగులు చేసి గెలుపొందింది. విరాట్ కోహ్లీ(45 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 62 నాటౌట్), ఫిల్ సాల్ట్(33 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్లతో 65) హాఫ్ సెంచరీలతో రాణించారు. దేవదత్ పడిక్కల్(28 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 40 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో కుమార్ కార్తీకేయ ఒక్కడే వికెట్ తీసాడు.