ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ పాలసీని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఖరారు చేసింది. ప్రతీ ఫ్రాంచైజీ ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు అనుమతిచ్చింది. ఇందులో ఒక రైట్ టు మ్యాచ్(ఆర్టీఎం) కార్డ్ కూడా ఉంది. అట్టిపెట్టుకున్న ఐదుగురి ఆటగాళ్ల కోసం రూ.75 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ప్రతీ జట్టు పర్స్ వాల్యూను రూ. 120 కోట్లకు పెంచింది. రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు వరుసగా రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు, రూ. 11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగు, ఐదో ఆటగాడిని తీసుకోవాలనుకుంటే తిరిగి రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటే రూ. 45 కోట్లు మాత్రమే మిగులుతాయి.

ఈ డబ్బుతోనే వేలంలో ఆర్టీఎమ్తో పాటు 15 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అనామక ఆటగాళ్లను రిటైన్ చేసుకోవాలనుకుంటే రూ. 4 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. బీసీసీఐ ఐపీఎల్ రిటెన్షన్ పాలసీని ప్రకటించడంతో ఫ్రాంచైజీలు తమ ప్రణాళికలను సిద్దం చేసుకుంటున్నాయి. రిటైన్ చేసుకునే ఆటగాళ్లతో పాటు వేలంలో కొనుగోలు చేసే ప్లేయర్లపై ఫోకస్ పెడుతున్నాయి.
మరోవైపు ఆయా ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్లపై జోస్యాలు వెలువడుతున్నాయి. మాజీ క్రికెటర్లు పలు ఫ్రాంచైజీలకు సూచనలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ పేసర్, 2007 టీ20 వరల్డ్ కప్ విన్నర్ ఆర్పీ సింగ్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) రిటెన్షన్ లిస్ట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఆర్సీబీ.. విరాట్ కోహ్లీ ఒక్కడినే రిటైన్ చేసుకొని మిగతా ఆటగాళ్లందరినీ వేలంలోకి వదిలేస్తుందని తెలిపాడు. ఇదే సరైన వ్యూహమని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్లో ఆర్సీబీ టాప్ టీమ్గా కొనసాగుతున్నప్పటికీ.. ఆ జట్టు ఇప్పటి వరకు ఒక్క టైటిల్ గెలవలేదు. ప్రతీ ఏడాది ఏదో సమస్యను ఎదుర్కొంటుంది.
ఈ క్రమంలోనే ఆ జట్టు.. ముంబై ఇండియన్స్ వ్యూహాన్ని అమలు చేయాలని ఆర్పీ సింగ్ సూచించాడు. భారత స్టార్లతో కోర్ టీమ్ను ఎంపిక చేసుకోవాలని సలహా ఇచ్చాడు. ప్రస్తుతం ఆర్సీబీలో కోహ్లీతో పాటు రజత్ పటీదార్, మహమ్మద్ సిరాజ్ వంటి మంచి ఆటగాళ్లు ఉన్నారు. కానీ ఈ ఇద్దరూ రూ. 14 కోట్లు, రూ. 11 కోట్లు చెల్లించే ఆటగాళ్లు కాదని ఆర్పీ సింగ్ అభిప్రాయపడ్డాడు.
ఒకవేళ ఈ ఇద్దరు ఆటగాళ్ల అంత ధర పలికితే ఆర్టీఎమ్ కార్డ్ ఉపయోగించి తీసుకోవాలన్నాడు. రిటెన్షన్లోని ప్రైజ్ కంటే తక్కువ ధరకే లభిస్తారని అభిప్రాయపడ్డాడు. 'నా అభిప్రాయం ప్రకారం ఆర్సీబీ విరాట్ కోహ్లీని మాత్రమే రిటైన్ చేసుకొని మిగతా ఆటగాళ్లందరినీ వేలంలోకి వదిలేయాలి. కావాల్సిన ఆటగాడిని ఆర్టీఎమ్ ద్వారా తీసుకోవాలి. రజత్ పటీదార్ గురించి మాట్లాడుకుంటే అతను రూ. 11 కోట్ల కంటే తక్కువే పలికే ఆటగాడు. ఒకవేళ అతను ఆ ధర పలికితే ఆర్టీఎమ్ కింద తీసుకోవాలి.
సిరాజ్ కూడా రూ. 11 కోట్లకే లభిస్తాడు. అంతే తప్పా రూ. 14 కోట్లు ఏ మాత్రం పలకడు. ఒకవేళ పలికినా ఆర్టీఎమ్ రూపంలో ఆప్షన్ ఉంది. కాబట్టి ఆర్సీబీ కొత్త మైండ్సెట్తో వేలంలో వెళ్లాలి. వారికి కోహ్లీ అవసరం ఉంది. ఎన్నో ఏళ్లుగా అతను జట్టుకు కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. కాబట్టి అతని చుట్టూ జట్టును నిర్మించే ప్రయత్నం చేయాలి. ప్రస్తుతం ఉన్న ఆర్సీబీ టీమ్లో విరాట్ కోహ్లీ మినహా మరే ఆటగాడు రూ. 18, రూ. 14 కోట్లు పలుకుతాడని అనిపించడం లేదు.'అని ఆర్పీ సింగ్ చెప్పుకొచ్చాడు.