ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే)తో జరుగుతున్న మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటర్లు దుమ్మురేపారు. ఓపెనర్లు విరాట్ కోహ్లీ(33 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లతో 62), జాకోబ్ బెతెల్(33 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 55) హాఫ్ సెంచరీలతో శుభారంభం అందించగా.. చివర్లో రోమారియో షెఫర్డ్(14 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్లతో 53 నాటౌట్) విధ్వంసకర అర్థ శతకంతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 213 పరుగులు చేసింది. సీఎస్కే బౌలర్లలో మతీష పతీరణ(3/36) మూడు వికెట్లు తీయగా.. నూర్ అహ్మద్, సామ్ కరణ్ చెరో వికెట్ పడగొట్టారు. 3 ఓవర్లు బౌలింగ్ చేసి ఖలీల్ అహ్మద్(0/65) ధారళంగా పరుగులు ఇచ్చుకున్నాడు.
కోహ్లీ, జాకోబ్ విధ్వంసం..
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు జాకోబ్ బెతెల్, విరాట్ కోహ్లీ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి ఓవర్లో జాకోబ్ హ్యాట్రిక్ బౌండరీలు బాదగా.. ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో కోహ్లీ వరుస బంతులను సిక్సర్లుగా తరలించాడు. 28 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జాకోబ్ ఇచ్చిన సునాయస క్యాచ్ను జడేజా, పతీరణ ఒకరినొకరు గుద్దుకొని నేలపాలు చేశారు. అ అవకాశంతో చెలరేగిన అతను నూర్ అహ్మద్ బౌలింగ్లో రెండు బౌండరీలతో పాటు సిక్సర్ బాదాడు. కోహ్లీ కూడా దూకుడుగా ఆడటంతో పవర్ ప్లేలోనే ఆర్సీబీ 71 పరుగులు చేసింది.

దెబ్బతీసిన పతీరణ..
జడేజా బౌలింగ్లో బౌండరీ బాదిన జాకోబ్ బెతెల్ 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పతీరణ వేసిన మరుసటి ఓవర్లో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో అతను ఔటయ్యాడు. దాంతో తొలి వికెట్కు నమోదైన 97 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. జాకోబ్ ఔటైనా.. కోహ్లీ తన జోరును కొనసాగించాడు. జడేజా బౌలింగ్లో ఓ భారీ సిక్సర్తో పాటు బౌండరీ బాదిన కోహ్లీ 29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దూకుడుగా ఆడుతున్న కోహ్లీని సామ్ కరణ్ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత వచ్చిన దేవదత్ పడిక్కల్(17), జితేష్ శర్మ(7), రజత్ పటీదార్(11) భారీ షాట్స్ ఆడే క్రమంలో క్యాచ్ ఔట్గా వెనుదిరిగారు. పతీరణ బౌలింగ్లోనే పడిక్కల్, రజత్ పటీదార్ ఔటవ్వగా.. జితేష్ శర్మను నూర్ అహ్మద్ పెవిలియన్ చేర్చాడు.
రొమారియో షెపర్డ్ విధ్వంసం..
ఖలీల్ అహ్మద్ వేసిన 19వ ఓవర్లో రొమారియో షెఫర్డ్ వరసగా 6, 6, 4, 6, 6nb, 0, 4 బౌండరీలు బాది 33 పరుగులు పిండుకున్నాడు. పతీరణ వేసిన ఆఖరి ఓవర్లో రెండు ఫోర్లు, రెండు సిక్స్లు బాదిన షెఫర్డ్.. 14 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్లోనే అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ నమోదు చేసిన బ్యాటర్గా నిలిచాడు. రొమారియో విధ్వంసకర బ్యాటింగ్తో ఆర్సీబీ 213 పరుగుల భారీ స్కోర్ చేసింది.