టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఓ అభిమాని విచిత్రకర ప్రశ్న అడిగాడు. ఐపీఎల్ 2025 మెగా వేలం నేపథ్యంలో ఏ జట్టులోకి వెళ్తున్నావ్? అని రోహిత్ను ప్రశ్నించాడు. అందుకు అతను 'నీకేం కావాలో చెప్పు'అని అడిగాడు. వెంటనే సదరు అభిమాని 'ఆర్సీబీలోకి రావాలి'అని కోరాడు. ఆ మాటలు విన్న రోహిత్ చేయి ఉపుతూ మౌనంగా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ తొలి టెస్ట్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరు వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టీమిండియా రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.

ఇప్పటికే ఐపీఎల్ 2025 రిటెన్షన్కు సంబంధించిన రూల్స్ను బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 31లోపు రిటెన్షన్ జాబితాలను ప్రకటించాలని ఫ్రాంచైజీలను బీసీసీఐ ఆదేశించింది. నవంబర్ 30న ఐపీఎల్ 2025 మెగా వేలం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు రోహిత్ శర్మ.. ముంబై ఇండియన్స్లో కొనసాగుతాడా? లేక వేలంలోకి వస్తాడా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
ముంబై ఇండియన్స్లోనే కొనసాగేందుకు రోహిత్ అంగీకరించాడని, అతనితో పాటు సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాలను ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకుందని వార్తలు వచ్చాయి. మరోవైపు హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు కట్టబెట్టడంపై రోహిత్ శర్మ అసంతృప్తిగా ఉన్నాడని, కెప్టెన్సీ ఆఫర్ చేసే జట్టులోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని కూడా వార్తలు వచ్చాయి.
రోహిత్ శర్మ వేలంలోకి వస్తే రికార్డ్ ధర పలుకుతాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రోహిత్ శర్మ వేలంలోకి వస్తే ఆర్సీబీతో పాటు పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసేందుకు సిద్దంగా ఉన్నాయి.