ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఓ డీఆర్ఎస్ నిర్ణయం వివాదాస్పదమైంది. ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ.. నిర్ణీత సమయం ముగిసిన తర్వాత రివ్యూ కోరడం.. అంపైర్ అనుమతించడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారగా.. ముంబై ఇండియన్స్ తొండాట ఆడుతుందని, అంపైర్లు ఆ జట్టుకు అమ్ముడుపోయారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఐపీఎల్ మొత్తం స్క్రిప్ట్ ప్రకారం నడుస్తుందని, ముంబై ఇండియన్స్ను విజేతగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు.
అసలేం జరిగిందంటే..?
ఫజలక్ ఫరూఖీ వేసిన రెండో ఓవర్ ఐదో బంతికి రోహిత్ శర్మ వికెట్ల ముందు దొరికిపోయాడు. రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా.. అంపైర్ ఔటిచ్చాడు. రివ్యూ తీసుకునే ముందు సహచర ఓపెన్ ర్యాన్ రికెల్టన్ అభిప్రాయాన్ని రోహిత్ కోరాడు. అయితే డీఆర్ఎస్ తీసుకోవడానికి 15 సెకన్ల సమయం మాత్రమే ఉంటుంది. ఈ నిర్దిష్ట సమయం ధాటితే రివ్యూ కోరినా.. అంపైర్లు ఇవ్వరు.
అయితే రోహిత్ శర్మ టైమర్ జీరో అయిన తర్వాత రివ్యూ కోరినట్లు టీవీలో కనిపించింది. ఈ విషయాన్ని పట్టించుకోని అంపైర్.. థర్డ్ అంపైర్ సమీక్ష కోరాడు. రిప్లేలో రోహిత్ శర్మ నాటౌట్గా తేలింది. ఈ అవకాశంతో చెలరేగిన అతను హాఫ్ సెంచరీ సాధించాడు. దాంతో ముంబై భారీ స్కోర్ చేసింది. అయితే అంపైర్ల తప్పిదం కారణంగానే రాజస్థాన్ రాయల్స్కు నష్టం జరిగిందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ముంబై ఇండియన్స్ అనగానే రూల్స్ కూడా మారిపోతాయని సెటైర్లు పేల్చుతున్నారు.

100 పరుగుతో విజయం..
ఈ మ్యాచ్లో ముంబై 100 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 217 పరుగులు చేసింది. ర్యాన్ రికెల్టన్(38 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 61), రోహిత్ శర్మ(36 బంతుల్లో 9 ఫోర్లతో 53) హాఫ్ సెంచరీలతో రాణించారు. సూర్యకుమార్ యాదవ్(23 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 48 నాటౌట్), హార్దిక్ పాండ్యా(23 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 48 నాటౌట్) మెరుపులు మెరిపించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో మహీష్ తీక్షణ, రియాన్ పరాగ్ చెరో వికెట్ తీసారు.
అనంతరం రాజస్థాన్ రాయల్స్ 16.1 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. జోఫ్రా ఆర్చర్(27 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 30) టాప్ స్కోరర్గా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో కర్ణ్ శర్మ(3/19), ట్రెంట్ బౌల్ట్(3/28) మూడేసి వికెట్లు తీయగా.. జస్ప్రీత్ బుమ్రా(2/15) రెండు వికెట్లు పడగొట్టాడు. దీపక్ చాహర్, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీసారు. 12 ఏళ్ల సుదర్ఘీ నిరీక్షణ తర్వాత జైపూర్ గడ్డపై ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఈ ఓటమితో రాజస్థాన్ రాయల్స్ అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.