ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలం నేపథ్యంలో ఫ్రాంచైజీలు సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రిటెన్షన్ ప్రక్రియలో నాలుగు నుంచి ఐదుగురు ఆటగాళ్లనే అంటిపెట్టుకునే అవకాశం ఉండటంతో జట్లన్నీ పూర్తిగా మారిపోనున్నాయి. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. తన ఐపీఎల్ టీమ్ ముంబై ఇండియన్స్ను వీడనున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఐదు సార్లు ఛాంపియన్గా నిలబెట్టిన తనను తప్పించి హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలను కట్టబెట్టడంపై రోహిత్ అసంతృప్తిగా ఉన్నాడు. ఐపీఎల్ 2024 సీజన్ సందర్భంగా ఈ విషయం స్పష్టమైంది. కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్తో ముంబై ఇండియన్స్ గురించి రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి.

రోహిత్ గుడ్బై..
ముంబై ఇండియన్స్ జట్టుతో తన ప్రయాణం ముగిసిందని అభిషేక్తో రోహిత్ అన్నాడు. అప్పట్లో ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా దుమారం రేపింది. బ్రాడ్కాస్టర్స్పై రోహిత్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. రోహిత్ శర్మతో పాటు సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాలు కూడా ముంబై ఇండియన్స్ రిటెన్షన్కు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది.
ఇతర జట్ల కెప్టెన్సీ ఆఫర్స్ నేపథ్యంలోనే ఈ ముగ్గురు స్టార్ ఆటగాళ్లు ముంబై ఇండియన్స్ను వీడనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. రోహిత్ శర్మకు ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ల నుంచి కెప్టెన్సీ ఆఫర్స్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టులోకి కూడా రోహిత్ శర్మ వెళ్లే అవకాశం లేకపోలేదు.

ఆర్సీబీ హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్..
టీమిండియా హెడ్ కోచ్గా వీడ్కోలు పలికిన రాహుల్ ద్రవిడ్.. ఆర్సీబీ హెడ్ కోచ్గా బాధ్యతలు స్వీకరించనున్నాడని ఆ జట్టు వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే రాహుల్ ద్రవిడ్తో ఆర్సీబీ మేనేజ్మెంట్ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ద్రవిడ్ కూడా తన సొంత రాష్ట్రానికి చెందిన ఆర్సీబీకి కోచ్గా లేదా మెంటార్గా పని చేసేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.
రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్గా ఎంపికైతే.. రోహిత్ శర్మను ఆర్సీబీలోకి తీసుకొస్తాడని ఆ జట్టు ఫ్యాన్స్ భావిస్తున్నారు. రోహిత్ శర్మ సారథ్యంలో ఆర్సీబీ.. ఐపీఎల్ టైటిల్ కలను నెరవేర్చుకుంటుందని కామెంట్ చేస్తున్నారు.
అండర్ 19 టీమ్ కోచ్గా, ఎన్సీఏ డైరెక్టర్గా.. టీమిండియా హెడ్ కోచ్గా అపారమైన అనుభవం ఉన్న రాహుల్ ద్రవిడ్ కోసం ఫ్రాంచైజీలు పోటీపడుతున్నాయి. ఆయనకు భారీ ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. గతంలో ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్కు ఆడిన ద్రవిడ్.. ఐపీఎల్కు వీడ్కోలు పలికిన అనంతరం రాజస్థాన్ రాయల్స్ మెంటార్గా పనిచేశాడు.
మరోసారి ఆ జట్టు బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా రోహిత్, కోహ్లీ కలిసి ఆర్సీబీకి ఆడితే అంతకు మించిన అనందం మరొకటి ఉండదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.