ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 2025 సీజన్లో వరుస వైఫల్యాలకు చెక్ పెడుతూ.. విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగిన రోహిత్ శర్మ రికార్డుల మోత మోగించాడు. టీ20 క్రికెట్లో భారత గడ్డపై అత్యధిక సిక్స్లు బాదిన తొలి ప్లేయర్గా హిట్మ్యాన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో ఆదివారం ముంబై వేదికగా జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ(45 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్లతో 76 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. దాంతో ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో సీఎస్కేను చిత్తు చేసింది.
ముంబై విజయంలో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకుంది. దాంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ గెలుచుకున్న ఆటగాడిగానూ రోహిత్ రికార్డ్ సాధించాడు. చెన్నై సూపర్ కింగ్స్పై అత్యధిక సార్లు 50 ప్లస్ రన్స్ చేసిన ఆటగాడిగానూ హిట్ మ్యాన్ నిలిచాడు.

క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
తాజా మ్యాచ్లో 6 సిక్స్లు బాదిన రోహిత్ శర్మ.. యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ క్రిస్ గేల్ పేరిట ఉన్న అరుదైన ఘనతను అధిగమించాడు. టీ20 క్రికెట్లో ఒకే దేశంలో అత్యధిక సిక్స్లు నమోదు చేసిన బ్యాటర్గా క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డ్ను రోహిత్ తాజా ఇన్నింగ్స్తో బ్రేక్ చేశాడు.
వెస్టిండీస్ గడ్డపై క్రిస్ గేల్ 357 సిక్స్లు కొట్టగా.. రోహిత్ శర్మ భారత గడ్డపై 361 సిక్స్లు నమోదు చేశాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ (భారత గడ్డపై 325 సిక్స్లు), మహేంద్ర సింగ్ ధోనీ(భారత గడ్డపై 286 సిక్స్లు), కీరన్ పోలార్డ్ (వెస్టిండీస్పై 276 సిక్స్లు), సంజూ శాంసన్(భారత్లో 274 సిక్స్లు), నికోలస్ పూరన్(వెస్టిండీస్లో 271 సిక్స్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
కోహ్లీ రికార్డ్ బద్దలు..
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ అందుకున్న భారత ఆటగాడిగా రోహిత్ శర్మ చరిత్రకెక్కాడు. ఇప్పటి వరకు రోహిత్ శర్మ 20 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ గెలుచుకోగా.. విరాట్ కోహ్లీ 19, మహేంద్ర సింగ్ ధోనీ 18 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ అందుకున్నారు. ఇందులో సీఎస్కే, కేకేఆర్పై ఐదేసి సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకున్న రోహిత్.. ఆర్సీబీపై 4 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.
కోహ్లీ రికార్డ్ సమం..
చెన్నై సూపర్ కింగ్స్పై అత్యధిక హాఫ్ సెంచరీలు నమోదు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లీతో సమంగా నిలిచాడు. ఈ ఇద్దరూ సీఎస్కేపై 9 హాఫ్ సెంచరీలు నమోదు చేశారు.