చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) అభిమానుల మధ్య గొడవ అదుపు తప్పిందని మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప ఆందోళన వ్యక్తం చేశాడు. మైదానంలో, మైదానం బయట ఈ ఇరు జట్ల అభిమానులు ప్రవర్తిస్తున్న తీరు అభ్యంతకరంగా ఉందన్నాడు. ఐపీఎల్ 2025 సీజన్లో ఆర్సీబీ, సీఎస్కే మధ్య జరిగిన రెండు మ్యాచ్ల్లో అభిమానులు అతిగా ప్రవర్తించారు.
చెన్నై వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో లాలిపాప్లతో ఆర్సీబీ ఫ్యాన్స్ను సీఎస్కే ఆటగాళ్లు ఎగతాళి చేశారు. అయితే ఈ మ్యాచ్లో ఆర్సీబీ విజయం సాధించడంతో ఆ జట్టు అభిమానులు.. సీఎస్కే ఫ్యాన్స్ను వెక్కిరించారు. కొందరిపై బౌతిక దాడికి కూడా దిగారు. రెండో మ్యాచ్ సందర్భంగా సీఎస్కే జట్టును రెండేళ్ల పాటు నిషేధించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. నల్లటి చారలతో ఉన్న టీషర్ట్స్ను ధరించారు. ఈ మ్యాచ్లోను ఆర్సీబీ విజయం సాధించగా.. సీఎస్కే ఆటగాళ్ల సతీమణులను కూడా ఎగతాళి చేశారు. బస్సులో వెళ్తున్న ఆటగాళ్లను ఆర్సీబీ ఆర్సీబీ అని అరుస్తూ వెక్కిరించారు. మైదానం మహిళా ఫ్యాన్స్ను ఆటపట్టించారు.

ఫ్యాన్స్ వార్ సరికాదు..
ఈ ఘటనలపై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన రాబిన్ ఊతప్ప.. ఈ తరహా ఫ్యాన్స్ వార్ సరికాదని అభిప్రాయపడ్డాడు. ఈ ఘటనలు క్రీడాస్ఫూర్తికి విరుద్దమని చెప్పుకొచ్చాడు. 'ఆర్సీబీ, సీఎస్కే ఫ్యాన్స్ గొడవ ఆందోళనకరంగా మారింది. స్టేడియం బయట ఆటగాళ్ల బస్సు వెళ్తున్నప్పుడు వారిని హేళన చేయడం, అభిమానులు కొట్టుకోవడం, మహిళలను వేధించడం వంటి ఘటనలు బాధాకరం. ఇలాంటి ప్రవర్తన క్రీడా స్ఫూర్తికి విరుద్ధం.
ముఖ్యంగా ఆర్సీబీ అభిమానులు.. సీఎస్కే జట్టు నిషేధ కాలాన్ని గుర్తు చేస్తూ టీషర్ట్స్ ధరించడం సరికాదు. ఆర్సీబీ, సీఎస్కే ఫ్యాన్స్ వార్ అదుపు తప్పుతోంది. వ్యక్తిగత దూషణలకు దారి తీస్తోంది. క్రీడలు అనేవి కేవలం వినోదం కోసం మాత్రమే. అభిమానుల మధ్య స్నేహపూర్వక పోటీ మాత్రమే ఉండాలి.'అని రాబిన్ ఊతప్ప అభిప్రాయపడ్డాడు.
అంబటి రాయుడి వల్లే..
సీఎస్కే, ఆర్సీబీ అభిమానుల మధ్య గతేడాదే గొడవ మొదలైంది. ఐపీఎల్ 2024 సీజన్లో ఆర్సీబీ వరుసగా 6 మ్యాచ్ల్లో విజయం సాధించి ప్లే ఆఫ్స్ చేరింది. సీఎస్కేతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో అద్భుత విజయాన్నందుకొని ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. దాంతో ఆ జట్టు ఆటగాళ్లు టైటిల్ గెలిచిన రీతిలో సంబరాలు చేసుకున్నారు. ఆ సమయంలో సీఎస్కే మాజీ బ్యాటర్ అంబటి రాయుడు ఆర్సీబీని తక్కువ చేస్తూ మాట్లాడాడు. ఆ తర్వాత అవకాశం దొరికినప్పుడల్లా టైటిల్ గెలవలేదని, గెలవదని సెటైర్లు పేల్చాడు. ఈ వ్యాఖ్యలు ఇరు జట్ల అభిమానుల గొడవకు ఆజ్యం పోసాయి.