చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీలో ఐపీఎల్ టైటిల్ గెలవాలనే ఫైర్ ఇంకా ఉందని మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప అన్నాడు. ధోనీ ఆరోగ్యంపైనే రిటైర్మెంట్ నిర్ణయం ఆధారపడి ఉందని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2025 సీజన్లో దారుణంగా విఫలమైన చెన్నై సూపర్ కింగ్స్.. విజయంతో ఈ సీజన్ను ముగించింది. ఆదివారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఆఖరి మ్యాచ్లో 83 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అంతా భావించారు. కానీ ధోనీ మాత్రం మరో 4-5 నెలల తర్వాత తుది నిర్ణయం ప్రకటిస్తానని చెప్పాడు. ధోనీ సారథ్యంలో తొలిసారి చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్స్ టేబుల్లో ఆఖరి స్థానంలో నిలిచింది.
ధోనీ రిటైర్మెంట్ గురించి జియో హాట్స్టార్తో మాట్లాడిన రాబిన్ ఊతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ టైటిల్ గెలవాలనే కసి ధోనీలో ఇంకా ఉందని, వచ్చే సీజన్ కోసం అతను మరింత కష్టపడే అవకాశం ఉందని ఊతప్ప అభిప్రాయపడ్డాడు. 'ధోనీ రిటైర్మెంట్ అనేది అతని ఆరోగ్యంతో పాటు అతను ఎలా ఫీలవుతున్నాడనే దానిపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. అతను ఇంకా ఆడాలని కోరుకుంటున్నాడు. ఇది అందరూ అర్థం చేసుకోవాలి. టైటిల్ గెలవాలనే ఫైర్ ఇంకా అతనిలో ఉంది. మ్యాచ్ అనంతరం అతను మాట్లాడిన మాటలతో ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. వచ్చే సీజన్ కోసం ధోనీ మరింత కష్టపడే అవకాశం ఉంది.'అని రాబిన్ ఊతప్ప చెప్పుకొచ్చాడు.

గుజరాత్ టైటాన్స్తో ఆఖరి లీగ్ మ్యాచ్ అనంతరం రిటైర్మెంట్పై స్పందిస్తూ ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రిటైర్మెంట్ విషయంలో తనకు కంగారు లేదని, తుది నిర్ణయం తీసుకోవడానికి ఇంకా 4-5 నెలల సమయం ఉందని ధోనీ స్పష్టం చేశాడు. ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా రిటైర్మెంట్ ప్రకటిస్తే.. చాలా మంది ఆటగాళ్లు 22 ఏళ్లకే రిటైర్మెంట్ కావాల్సి వస్తుందన్నాడు.
'రిటైర్మెంట్ అనేది ఫిట్నెస్పై ఆధారపడి ఉంటుంది. రిటైర్మెంట్పై తుది నిర్ణయం తీసుకునేందుకు నాకు 4-5 నెలల సమయం ఉంది. రిటైర్మెంట్ విషయంలో తొందరపడాల్సిన పనిలేదు. ప్రతీ ఏడాది శరీరాన్ని ఫిట్గా ఉంచడానికి 50 శాతం ఎక్కువ కష్టపడాలి. ఐపీఎల్ క్రికెట్లో అత్యున్నత స్థాయి. క్రికెటర్లు ప్రదర్శనను బట్టి రిటైర్మెంట్ తీసుకుంటే.. కొందరు 22 ఏళ్లకే వీడ్కోలు పలకాల్సి ఉంటుంది. ఆడాలనే కోరిక, ఫిట్నెస్, జట్టుకు ఎంత ఉపయోగపడగలమనేది రిటైర్మెంట్ నిర్ణయంపై ప్రభావం చూపుతాయి. నా కెరీర్ ముగిసిందని చెప్పడం లేదు. అదే సమయంలో మళ్లీ తిరిగి వస్తానని కూడా చెప్పడం లేదు.'అని ధోనీ చెప్పుకొచ్చాడు.