ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్కు ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్ గుడ్బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఫ్రాంచైజీ ఓనర్లతో రిషభ్ పంత్కు సఖ్యత లేదని ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్ 2025 మెగా వేలం నిర్వహణపై ఫోకస్ పెట్టిన భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ).. ఇప్పటికే రిటెన్షన్ రూల్స్ను ప్రకటించిన విషయం తెలిసిందే.
ప్రతీ జట్టుకు ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకునే అవకాశం కల్పించింది. ఇందులో గరిష్టంగా ఐదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లు ఉండాలనే నిబంధన పెట్టింది. విదేశీ ఆటగాళ్లపై ఎలాంటి పరిమితి విధించలేదు. ఆరుగురి ఆటగాళ్లను నేరుగా రిటైన్ చేసుకోవచ్చు లేదా ఆర్టీఎమ్ కార్డ్ ద్వారా వేలంలో తిరిగి కొనుగోలు చేయవచ్చు.

రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు, రూ.11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగు, అయిదో ఆటగాడిని తీసుకోవాలనుకుంటే తిరిగి రూ.18 కోట్లు, రూ.14 కోట్లు చెల్లించాలి. అన్క్యాప్డ్ ప్లేయర్ను రిటైన్ చేసుకుంటే మాత్రం రూ.4 కోట్లు చెల్లించాలి. ఫ్రాంచైజీల పర్స్ వాల్యూను రూ. 120 కోట్లకు పెంచారు. అక్టోబర్ 31వ తేదీలోపు రిటెన్షన్ జాబితాలను సమర్పించాలని ఫ్రాంచైజీలను బీసీసీఐ ఆదేశించింది.
నవంబర్ 30న మెగా వేలం నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. డిసెంబర్ మొదటి వారంలో బీసీసీఐ సెక్రటరీ జై షా.. ఐసీసీ ఛైర్మన్ పదవి బాధ్యతలు చేపట్టనున్నాడు. బీసీసీఐ సెక్రటరీగా జై షా ఉండగానే మెగా వేలాన్ని పూర్తి చేయాలని బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ క్యాపిటల్స్ తమ కెప్టెన్ రిషభ్ పంత్ను మొదటి ఆటగాడిగా రూ. 18 కోట్లు చెల్లించి తీసుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ రిటెన్షన్ రూల్స్ ధరల విషయంలో ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్తో ఆటగాళ్లకు విభేదాలు తలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్కు జీఎమ్ఆర్, జిందాల్ సంస్థలు సంయుక్త యజమానులుగా కొనసాగుతున్నాయి.
రెండేళ్లకు ఒకసారి ఈ రెండు సంస్థలు ఢిల్లీ జట్టు నిర్వహణ బాధ్యతలు బదిలీ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే గత రెండేళ్లుగా జట్టును బాధ్యతలను చూసుకున్న జిందాల్ తప్పుకొని జీఎమ్ఆర్ కంపెనీకి అప్పజెప్పింది. దాంతో జీఎమ్ఆర్ ఓనర్ కిరణ్ కుమార్ గ్రంధి జట్టును పర్యవేక్షిస్తున్నాడు. ఇప్పటికే హెడ్ కోచ్ పదవి బాధ్యతల నుంచి రికీ పాంటింగ్ను తప్పించాడు.
ఈ క్రమంలోనే బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ అనంతరం కిరణ్ కుమార్ గ్రంధిని రిషభ్ పంత్ దుబాయ్లో కలిసాడు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్.. రిషభ్ పంత్ టీ20 గణంకాల గురించి మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. టీమ్ సమావేశంలో రిషభ్ పంత్ బ్యాటింగ్ గురించి బహిరంగంగా మాట్లాడటంతో అతను అసంతృప్తికి గురైనట్లు సమాచారం.
దాంతోనే రిషభ్ పంత్.. ఎక్స్ వేదికగా 'ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొంటే ఎన్ని కోట్లు పలుకుతాను?'అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ ట్వీట్తో ఢిల్లీ క్యాపిటల్స్ షాక్ గురయ్యారని, పంత్తో సఖ్యత లేదని ప్రచారం జరుగుతోంది. ఈ కారణంతోనే ఢిల్లీ క్యాపిటల్స్ను వీడేందుకు పంత్ సిద్దమైనట్లు తెలుస్తోంది.