బౌలర్ల అసాధారణ ప్రదర్శనతోనే ఓడిపోయే మ్యాచ్లో విజయం సాధించామని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ అన్నాడు. ఇలాంటి విజయాలే జట్టు క్యారెక్టర్ను బిల్డ్ చేస్తాయని చెప్పాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో శనివారం జరిగిన రెండో మ్యాచ్లో లక్నో 2 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో ఆవేశ్ ఖాన్(3/37) అద్భుత ప్రదర్శనతో లక్నో చారిత్రాత్మక విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై సంతోషం వ్యక్తం చేసిన రిషభ్ పంత్.. ఆవేశ్ ఖాన్తో పాటు ఇతర బౌలర్లపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ గెలుపు క్రెడిట్ బౌలర్లదేనన్నాడు.
ఈ క్రెడిట్ వారిదే..
'ఈ విజయం బిగ్ రిలీఫ్తో పాటు సంతోషాన్నిచ్చింది. ఇలాంటి మ్యాచ్లే మన వ్యక్తిత్వాన్ని పెంచుతాయి. ఇదో అద్భుతమైన విజయం. ఈ గెలుపు మా జట్టును మరో స్థాయికి తీసుకెళ్తోంది. ఈ రకమైన మ్యాచ్లు జట్టుతో పాటు ఆటగాళ్ల క్యారెక్టర్ను బిల్డ్ చేస్తాయి. మేం ఎప్పుడూ మాట్లాడుకునే సానుకూలంశాలు ఇవే. ముందు ముందు మా నుంచి మెరుగైన ప్రదర్శన వస్తుందని భావిస్తున్నా. ఈ గెలుపు క్రెడిట్ బౌలర్లదే. సరైన సమయంలో ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇది అంత సులువైన విజయం కాదు. ఈ మ్యాచ్లో ఆఖరి వరకు మేం వెనుకబడే ఉన్నాం. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. కానీ మా బౌలర్లు ధైర్యంగా బౌలింగ్ చేశారు.

ఆవేశ్ ఖాన్ అదరగొట్టాడు..
ముఖ్యంగా ఆవేశ్ ఖాన్ అదరగొట్టాడు. మూడు ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. చివరి ఓవర్లో కావాల్సిన టైమ్ తీసుకొని స్పష్టమైన మైండ్సెట్తో బౌలింగ్ చేయాలని చెప్పాను. ఒక్కో బంతిని మెరుగ్గా వేస్తూ ఆఖరి వరకు మ్యాచ్ తీసుకెళ్లాలనేది మా వ్యూహం. ఇలాంటి సమయంలో బౌలర్లు, ఫీల్డర్లపై నమ్మకం ఉంచడం చాలా కీలకం. మేం సానుకూల దిశలో ముందుకు సాగుతున్నాం. ప్రస్తుతం ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నాం. ఆ తర్వాత మేం మెరుగవ్వాల్సిన విషయాలపై ఫోకస్ పెడ్తాం.'అని రిషభ్ పంత్ చెప్పుకొచ్చాడు.
సమద్ మెరుపులు..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. ఎయిడెన్ మార్క్రమ్(45 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 66), ఆయుష్ బదోని(34 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్లతో 50) హాఫ్ సెంచరీలతో రాణించగా.. అబ్దుల్ సమద్(10 బంతుల్లో 4 సిక్స్లతో 30 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. రాజస్థాన్ బౌలర్లలో వానిందు హసరంగా(2/31) రెండు వికెట్లు తీయగా.. సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండే, జోఫ్రా ఆర్చర్ తలో వికెట్ పడగొట్టారు.
పాపం సూర్యవంశీ..
అనంతరం రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 178 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(52 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 74), వైభవ్ సూర్యవంశీ(20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 34), రియాన్ పరాగ్(26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 39) రాణించినా ఫలితం లేకపోయింది. లక్నో బౌలర్లలో ఆవేశ్ ఖాన్(3/37) మూడు వికెట్లతో రాజస్థాన్ పతనాన్ని శాసించగా.. శార్దూల్ ఠాకూర్, ఎయిడెన్ మార్క్రమ్ తలో వికెట్ తీసారు.