ఐపీఎల్ 2025 సీజన్కు సంబంధించిన ఓ వార్త నెట్టింట చర్చనీయాంశమైంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్కు ఆ జట్టు వీడ్కోలు చెప్పనుందని ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్ 2025 మెగా వేలం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైతే మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ పాలసీని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించలేదు. కానీ గత రిటెన్షన్ పాలసీ ప్రకారం ఒక జట్టు గరిష్టంగా నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది.
రైట్ టు మ్యాచ్ కార్డ్ కింద వేలంలో ఓ ప్లేయర్ను మాత్రమే తీసుకోవచ్చు. అయితే రిటెన్షన్ పాలసీ విషయంలో ఫ్రాంచైజీలు బీసీసీఐ ముందు వింత డిమాండ్లు పెట్టినట్లు కూడా వార్తలు వచ్చాయి. గరిష్టంగా 8 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఇవ్వాలని ఫ్రాంచైజీ ఓనర్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

మెగా వేలం నేపథ్యంలో జట్టు ప్రక్షాళనపై ఫోకస్ పెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్.. ముందుగా హెడ్ కోచ్ రికీ పాంటింగ్పై వేటు వేసింది. గత ఏడేళ్లుగా పాంటింగ్ ఆ జట్టుకు కోచ్గా సేవలందిస్తున్నాడు. కానీ టైటిల్ మాత్రం అందివ్వలేకపోయాడు. దాంతో పాంటింగ్ను తప్పించిన ఢిల్లీ యాజమాన్యం కెప్టెన్ను కూడా మార్చాలనే యోచనలో ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఒకవేళ పంత్ను ఢిల్లీ వదులకుంటే.. అతన్ని తీసుకోవాలని చెన్నై సూపర్ కింగ్స్ భావిస్తుందంట. ధోనీ వారసుడిగా అతన్ని జట్టులోకి తీసుకోవాలనే ప్రణాళికలు రచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మహేంద్ర సింగ్ ధోనీ ఈ ఏడాదే ఐపీఎల్కు వీడ్కోలు పలుకుతాడని అంతా భావించారు. కానీ అతను ఎలాంటి ప్రకటనా చేయలేదు. కానీ మెగా వేలం నేపథ్యంలో ధోనీని చెన్నై రిటైన్ చేసుకోవడం కష్టమే. ఈ క్రమంలోనే ధోనీ స్థానాన్ని పంత్తో భర్తీ చేయాలని సీఎస్కే భావిస్తోందంట.
వికెట్ల వెనకాల ధోనీలా చురుకుగా ఉంటూ, బ్యాటుతోనూ విధ్యంసం సృష్టించే పంత్.. తమ జట్టు కూర్పుకు సరిపోతాడని సీఎస్కే ఆలోచిస్తోందంట. ఈ క్రమంలోనే రిషభ్ పంత్ను కుదిరితే ట్రేడింగ్ పద్దతిలో లేదా.. వేలంలో దక్కించుకోవాలని సీఎస్కే ప్రణాళికలు రచిస్తోందంట. ఘోర రోడ్డు ప్రమాదంతో 15 నెలల పాటు ఆటకు దూరమైన పంత్.. ఐపీఎల్ 2023 సీజన్తోనే మైదానంలోకి అడుగుపెట్టాడు.
మునపటిలా సత్తా చాటి టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. టీ20 ప్రపంచకప్ 2024 విజయంలోనూ కీలక పాత్ర వహించాడు. అయితే రిషభ్ పంత్ను వదులుకునే విషయంపై ఢిల్లీ క్యాపిటల్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.