ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. యువ సంచలనం, విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్కు జట్టు సారథ్య బాధ్యతలు కట్టబెట్టేందుకు సిద్దమైనట్లు ప్రచారం జరుగుతోంది. కేకేఆర్ నుంచి అధికారిక ప్రకటన రాకున్నా.. ఐపీఎల్ 2025 సీజన్లో అతనే జట్టును నడిపిస్తాడనే చర్చ జోరుగా సాగుతోంది.
తమకు టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్ను కేకేఆర్ వేలంలోకి వదిలేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ సూచనలతోనే అయ్యర్.. కేకేఆర్ను వీడినట్లు తెలుస్తోంది. వేలంలో కొనుగోలు చేసి సారథ్య బాధ్యతలు అప్పగిస్తామని ఢిల్లీ యాజమాన్యం హామీ ఇవ్వడంతోనే అయ్యర్.. కేకేఆర్ రిటెన్షన్ ఒప్పుకోలేదని సమాచారం.

మరోవైపు కేకేఆర్ తమ టాప్ ప్లేయర్గా రింకూ సింగ్ను రూ. 13 కోట్లకు రిటైన్ చేసుకుంది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ, విధ్వంసకర ఆల్రౌండర్లు సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్లను రూ. 12 కోట్లకు అట్టిపెట్టుకుంది. అనామక ఆటగాళ్లు అయిన హర్షిత్ రాణా, రమణ్దీప్ సింగ్లను రూ. 4 కోట్లుకు రిటైన్ చేసుకుంది. ఈ ఆరుగురి ఆటగాళ్ల కోసం కేకేఆర్ రూ. 57 కోట్లు ఖర్చు చేసింది. ఆ జట్టు వద్ద ఇంకా రూ. 63 కోట్లు ఉన్నాయి.
ప్రస్తుతం ఆ జట్టుకు స్పెషలిస్ట్ కెప్టెన్ అవసరం ఉంది. శ్రేయస్ అయ్యర్ ఢిల్లీతో ఒప్పందం కుదుర్చుకోగా.. పంత్ పంజాబ్ కింగ్స్కు వెళ్లే ఛాన్స్ ఉంది. కేఎల్ రాహుల్ ఆర్సీబీ వైపు చూస్తండగా.. కేకేఆర్ ముందు కెప్టెన్సీ ఆప్షన్ ఉన్న భారత ఆటగాళ్లు లేకుండా పోయారు. మళ్లీ విదేశీ ఆటగాళ్లనే సారథిగా నియమించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ క్రమంలోనే రింకూ సింగ్కు సారథ్య బాధ్యతలు కట్టబెట్టి.. జట్టుకు అవసరమైన ఆటగాళ్లను కొనుగోలు చేయాలని కేకేఆర్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే రింకూ సింగ్కు కెప్టెన్సీ అనుభవం లేదు. దేశవాళీ క్రికెట్లో కూడా ఇప్పటి వరకు అతను సారథిగా వ్యవహరించలేదు. రింకూ సింగ్కు కెప్టెన్సీ ఇస్తే.. ఒత్తిడికి గురవుతాడనే ఆందోళన కూడా కేకేఆర్కు ఉంది. కెప్టెన్గా స్వేచ్చగా ఆడుతాడా? అనేది కూడా ప్రశ్నగా మారింది.
ఒకవేళ రింకూ సింగ్ కెప్టెన్గా బాధ్యతలు అందుకుంటే మాత్రం.. శ్రేయస్ అయ్యర్ వారసత్వాన్ని అందుకోవాల్సి ఉంటుంది. దూకుడైన ఆటతో జట్టును నడిపించాల్సి ఉంటుంది. కింది స్థాయి నుంచి స్టార్ క్రికెటర్గా ఎదిగిన రింకూ సింగ్.. కెప్టెన్సీ పెద్ద కష్టం కాదని అతని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.