ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్ ఐపీఎల్ 2025 సీజన్పై పడింది. భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ 2025 సీజన్ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. ఆటగాళ్లు, ప్రేక్షకుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 'ఓవైపు దేశం యుద్ధం చేస్తుంటే.. మరోవైపు క్రికెట్ మ్యాచ్లు నిర్వహించడం సరైంది కాదనిపించింది'అని ఓ బీసీసీఐ అధికారి మీడియాకు తెలిపారు. భవిష్యత్తులో టోర్నీ నిర్వహణ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. త్వరలోనే పూర్తి వివరాలను బీసీసీఐ వెల్లడించే అవకాశం ఉంది.
భారత్-ఇంగ్లండ్ టెస్ట్ తర్వాతే..
అయితే ఐపీఎల్ 2025 సీజన్ తిరిగి జూలైలో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. టీమిండియా ఇంగ్లండ్ పర్యటన ముగిసిన తర్వాతే ఐపీఎల్ జరిగే ఛాన్స్ ఉందని ఓ జాతీయ మీడియా పేర్కొంది. అప్పటి వరకు ఖాళీ విండో లేదని పేర్కొంది. జూన్ 11 నుంచి 15 మధ్య జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు ముందు ఐపీఎల్ 2025 సీజన్ తిరిగి ప్రారంభిస్తే.. ఆసీస్, సౌతాఫ్రికా ఆటగాళ్లు టోర్నీకి దూరంగా ఉండే అవకాశం ఉంది.

వర్షాలతో సవాల్..?
ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే ఇంగ్లండ్తో టీమిండియా ఐదు టెస్ట్ల సిరీస్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2025 కోసం ఐసీసీ షెడ్యూల్ను మార్చలేరు. కాబట్టి ఈ పర్యటన ముగిసిన తర్వాతే టోర్నీని నిర్వహించే ఛాన్స్ ఉంది. అయితే ఆ సమయంలో భారత్లో వర్ష కాలం. వర్షాలతో మ్యాచ్లకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2025 సీజన్ మిగతా మ్యాచ్లను విదేశాల్లో నిర్వహించే ఛాన్స్ ఉందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. లేదంటే సెప్టెంబర్లో టోర్నీని పూర్తి చేయవచ్చనే వార్తలు కూడా వస్తున్నాయి.
ఐపీఎల్ 2025 సీజన్లో ఇంకా 12 లీగ్ మ్యాచ్లతో పాటు రెండు క్వాలిఫయర్స్, ఒక ఎలిమినేటర్, మరో ఫైనల్ మ్యాచ్ నిర్వహించాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం మే25న కోల్కతా వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇప్పటికే పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య గురువారం జరగాల్సిన మ్యాచ్ భద్రతా కారణాలరీత్యా మధ్యలోనే రద్దు చేసిన విషయం తెలిసిందే.
భయంలో విదేశీ ఆటగాళ్లు..
భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో విదేశీ ఆటగాళ్లు భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు తమ స్వదేశానికి వెళ్తామని బీసీసీఐకి చెప్పినట్లు తెలుస్తోంది. ఆటగాళ్లందరూ భయాందోళనకు గురవ్వడంతో పాటు.. మ్యాచ్ల నిర్వహణ, ప్రేక్షకుల భద్రత సవాల్గా మారడంతోనే బీసీసీఐ టోర్నీని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇలా ఐపీఎల్ అర్థంతరంగా వాయిదా వేయడం రెండోసారి. గతంలో కరోన కారణంగా ఐపీఎల్ను మధ్యలోనే వాయిదా వేసారు. పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత తిరిగిన ప్రారంభించారు.