ఐపీఎల్ 2025 సీజన్ రీస్టార్ట్ ముందు అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఐపీఎల్ 2025 రివైజ్డ్ షెడ్యూల్లో భాగంగా శనివారం బెంగళూరు వేదికగా జరగాల్సిన ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్కు భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్ను వారం రోజులు వాయిదా వేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో బీసీసీఐ.. ఐపీఎల్ 2025 టోర్నీని తిరిగి ప్రారంభించేందుకు సిద్దమైంది. ఇప్పటికే 17 మ్యాచ్లకు సంబంధించిన రివైజ్డ్ షెడ్యూల్ను ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం తొలి మ్యాచ్లో ఆర్సీబీ, కేకేఆర్ తలపడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

బెంగళూరులో వర్షాలు..
ప్రస్తుతం బెంగళూరులో సాయంత్రం వేళ వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా సాయంత్రం వేళ వర్షం పడింది. వర్షం కారణంగా గురువారం ఇరు జట్ల ప్రాక్టీస్ సెషన్స్ రద్దయ్యాయి. మైదానంలో భారీ నీరు చేరి చెరువుగా మారడంతో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టీమ్ డేవిడ్ చిన్న పిల్లాడిలా గంతులేసాడు. బట్టలు విప్పి.. వర్షపు నీటిలో డైవ్ చేస్తూ ఆడుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్గా మారింది.
అల్పపీడనం కారణంగా..
అరేబియా సముద్రంలో అల్పపీడనం కారణంగా శనివారం కూడా వర్షం పడే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఆర్సీబీ, కేకేఆర్ మ్యాచ్ సజావుగా సాగుతుందా? లేదా? అనే సందేహాలు నెలకొన్నాయి. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. ఆర్సీబీ అధికారికంగా ప్లే ఆఫ్స్ చేరుతుంది. కానీ ఆ జట్టు టాప్-2లో నిలవాలంటే ఆఖరి రెండు మ్యాచ్లు గెలవాల్సి ఉంటుంది. మరోవైపు కేకేఆర్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తోంది.
ఆర్సీబీ ఇప్పటి వరకు 11 మ్యాచ్ల్లో 8 గెలిచి 16 పాయింట్లతో పాయింట్స్ టేబుల్లో రెండో స్థానంలో కొనసాగుతోంది. కేకేఆర్ 12 మ్యాచ్ల్లో 5 విజయాలు, ఓ మ్యాచ్ రద్దవ్వడంతో 11 పాయింట్స్తో ఆరో స్థానంలో నిలిచింది. ఆ జట్టు చివరి రెండు మ్యాచ్లకు మూడు గెలిచినా ప్లే ఆఫ్స్ చేరలేని పరిస్థితి నెలకొంది. ఆర్సీబీతో మ్యాచ్ రద్దయితే అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తోంది.
ముఖా ముఖి పోరు..
ఇరు జట్ల ముఖా ముఖి పోరులో కేకేఆర్దే పై చేయిగా ఉంది. ఇప్పటి వరకు ఇరు జట్లు 35 సార్లు తలపడగా.. కేకేఆర్ 20, ఆర్సీబీ 15 విజయాలు సాధించాయి. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్లో కేకేఆర్ను ఆర్సీబీ ఓడించింది.