ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్కు ఊహించని పరాజయం ఎదురైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా విఫలమైన సీఎస్కే 50 పరుగుల తేడాతో చిత్తయ్యింది. అయితే ఈ మ్యాచ్లో ధోనీని.. ఆర్సీబీ ఎగతాళి చేసిందని సీఎస్కే ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కేకేఆర్ కెప్టెన్గా గౌతమ్ గంభీర్ ఉన్న సమయంలో ధోనీకి షార్ట్ లెగ్ ఫీల్డింగ్ పెట్టి అవమానించాడని, తాజాగా రజత్ పటీదార్ కూడా అదే ఫీల్డ్ సెటప్తో ఎగతాళి చేశాడని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 196 పరుగులు చేసింది. కెప్టెన్ రజత్ పటీదార్ (32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 51) హాఫ్ సెంచరీతో రాణించగా.. చివర్లో టీమ్ డెవిడ్ (8 బంతుల్లో 3 సిక్స్లు, ఫోర్తో 22 నాటౌట్) దూకుడుగా ఆడాడు. అనంతరం సీఎస్కే దారుణంగా విఫలమైంది. మ్యాచ్ ఆరంభంలోనే రుతురాజ్ గైక్వాడ్ డకౌటవ్వగా.. రాహుల్ త్రిపాఠి తీవ్రంగా నిరాశపరిచాడు.

డిఫెన్స్ ఆడిన ధోనీ..
అనంతరం మిడిలార్డర్ బ్యాటర్లు తేలిపోయారు. ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన శివమ్ దూబే(19) కూడా త్వరగానే ఔటయ్యాడు. దూబే అనంతరం ధోనీ క్రీజులోకి వస్తాడని అంతా భావించారు. కానీ ఆశ్చర్యకరంగా అశ్విన్ బ్యాటింగ్కు వచ్చాడు. అతను కూడా 11 పరుగులే చేసి వెనుదిరిగాడు. చివరకు 9వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ధోనీ దూకుడుగా ఆడకుండా.. డిఫెన్స్ చేస్తూ అభిమానులకు ఆగ్రహం తెప్పించాడు. డిఫెన్స్ ఆడుతున్న ధోనీని ఔట్ చేసేందుకు ఆర్సీబీ షార్ట్ లెగ్ ఫీల్డర్ను పెట్టింది.
టెస్ట్ బ్యాటింగ్ అంటూ..
ఇది సీఎస్కే అభిమానులను తీవ్రంగా బాధపెట్టింది. లివింగ్ స్టోన్ బౌలింగ్లో ధోనీని కట్టడి చేసేందుకు రజత్ పటీదార్.. షార్ట్ లెగ్ ఫీల్డర్ను పెట్టాడు. సాధారణంగా టీ20ల్లో ఈ ఫీల్డ్ పెట్టరు. టెస్ట్ ఫార్మాట్లో డిఫెన్స్ ఆడుతున్న బ్యాటర్లను కట్టడి చేసేందుకు స్పిన్ బౌలింగ్లో షార్ట్ లెగ్ ఫీల్డర్లను పెడుతారు. గతంలో గౌతమ్ గంభీర్.. ఐపీఎల్లో ధోనీకి ఇలానే షార్ట్ లెగ్ ఫీల్డర్ను పెట్టాడు. అప్పటి నుంచి టీ20ల్లో టెస్ట్ క్రికెట్ ఆడే బ్యాటర్ ధోనీ అని ఫ్యాన్స్ సరదాగా చెప్పుకుంటారు. ఇన్నాళ్లకు మళ్లీ ధోనీకి షార్ట్ లెగ్ ఫీల్డర్ పెట్టడంతో సీఎస్కే అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.
భారీ సిక్స్లు బాదిన ధోనీ..
ఆరంభంలో నిదానంగానే ఆడిన ధోనీ చివర్లో చెలరేగాడు. ముఖ్యంగా ఆఖరి ఓవర్లో వరుసగా రెండు భారీ సిక్స్లతో పాటు బౌండరీ బాది తాను ఇంకా అత్యుత్తమ ఫినిషర్ అనే విషయాన్ని చాటి చెప్పాడు. 16 బంతుల్లో 30 పరుగులు చేసి సీఎస్కే రన్రేట్ తగ్గకుండా ధోనీ జాగ్రత్త పడ్డాడు. ధోనీ 30 పరుగులు చేయకపోతే.. సీఎస్కే రన్ రేట్ మరీ దారుణంగా దిగజారేది.