ఐపీఎల్ టైటిల్ కోసం గత 17 ఏళ్లుగా నిరీక్షిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) వచ్చే ఏడాది అయినా ఆ ముచ్చట తీర్చుకోవాలనుకుంటుంది. ఐపీఎల్ 2024 సీజన్లో అసాధారణ ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ చేరిన ఆర్సీబీ.. ఫైనల్ మాత్రం చేరలేకపోయింది. ఐపీఎల్ 2025 సీజన్కు ముందు మెగా వేలం జరగనున్న నేపథ్యంలో పటిష్టమైన జట్టును తయారు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
ఈ ఏడాది డిసెంబర్లో మెగా వేలం జరగనుండగా.. బీసీసీఐ ఇంకా రిటెన్షన్ పాలసీని ప్రకటించలేదు. మరోవైపు ఫ్రాంచైజీలు మాత్రం తమ వ్యూహాలను సిద్దం చేసుకుంటున్నాయి. మెగా వేలంలో ఆర్సీబీ.. భారత్కు చెందిన ముగ్గురు అనామక క్రికెటర్లను కొనుగోలు చేయాలనుకుంటుంది.

నితీష్ కుమార్ రెడ్డి..
తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి వేలంలోకి వస్తే కొనుగోలు చేయాలని ఆర్సీబీ భావిస్తోంది. పేస్ ఆల్రౌండర్ అయిన నితీష్ కుమార్ రెడ్డిని తీసుకుంటే టీమ్ కాంబినేషన్లో సమతూకం వస్తుందని భావిస్తోంది. ఐపీఎల్ 2024 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున నితీష్ కుమార్ రెడ్డి సంచలన ప్రదర్శన చేశాడు.
ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డ్ను కూడా అందుకున్నాడు. భవిష్యత్తులో అతను టీమిండియా స్టార్గా ఎదిగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే నితీష్ కుమార్ రెడ్డికి ఆర్సీబీ అధిక ప్రాధాన్యత ఇస్తోంది. అయితే నితీష్ కుమార్ రెడ్డిని సన్రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
శశాంక్ సింగ్..
పంజాబ్ కింగ్స్ బిగ్ హిట్టర్ శశాంక్ సింగ్పై కూడా ఆర్సీబీ ఓ కన్నేసింది. ఐపీఎల్ 2024 సీజన్లో శశాంక్ సింగ్ సంచలన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. చివర్లో బ్యాటింగ్కు దిగి జట్టును విజయం వైపు నడిపించాడు. మంచి ఫినిషర్గా అందరి ప్రశంసలు అందుకున్నాడు. అలవోకగా భారీ షాట్లు ఆడటం అతని ప్రత్యేకత. అతను వేలంలోకి వస్తే కొనుగోలు చేయాలని ఆర్సీబీ భావిస్తోంది. అయితే పంజాబ్ కింగ్స్ శశాంక్ సింగ్ను వదులుకునే అవకాశాలు చాలా తక్కువ.
మహిపాల్ లోమ్రోర్..
ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించిన మహిపాల్ లోమ్రోర్ను తిరిగి కొనుగోలు చేసే అవకాశం ఉంది. బ్యాటింగ్తో పాటు బౌలింగ్ చేయగల సామర్థ్యం ఉండటం అతనికి కలిసొచ్చే అంశం. ఐపీఎల్ 2024 సీజన్లో మహిపాల్ లోమ్రోర్ పర్వాలేదనిపించాడు.