ఐపీఎల్ 2025 సీజన్ నేపథ్యంలో ఫ్రాంచైజీలు.. పిచ్ క్యూరేటర్ల మధ్య జరుగుతున్న వివాదానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) మెంటార్, బ్యాటింగ్ కోచ్ దినేశ్ కార్తీక్ మరింత ఆజ్యం పోసాడు. తాము కోరిన పిచ్ను బెంగళూరు క్యూరెటర్ సిద్దం చేయలేదని తెలిపాడు. అతను తయారు చేసిన చెత్త పిచ్ల కారణంగానే బెంగళూరు వేదికగా జరిగిన రెండు మ్యాచ్ల్లో ఆర్సీబీ ఓటమిపాలైందని అభిప్రాయపడ్డాడు.
ఇప్పటికే కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే, సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్లు.. పిచ్ క్యూరెటర్లపై విమర్శలు గుప్పించారు. పిచ్ క్యూరెటర్లు తమకు హోమ్ అడ్వాంటేజ్ లేకుండా చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రతీ టీమ్ తమకు అనుకూలంగా పిచ్లను తయారు చేసుకొని హోమ్ అడ్వాంటేజ్ను ఉపయోగించుకుంటుంది. కానీ ఈ సీజన్లో చాలా జట్లు హోమ్ గ్రౌండ్లో ఓటమిపాలవుతున్నాయి.

అదేం విచిత్రమో గానీ.. ఈ సీజన్లో బయటి వేదికలపై దుమ్ము రేపుతున్నఆర్సీబీ.. సొంతగడ్డపై మాత్రం తేలిపోతుంది. రెండు వరుస విజయాల తర్వాత చిన్నస్వామి స్టేడియంలో ఆడిన తొలి మ్యాచ్లో ఓడిన ఆర్సీబీ.. గత మ్యాచ్లో వాంఖడే వేదికగా ముంబైపై సంచలన విజయాన్నందుకుంది. కానీ మళ్లీ సొంత మైదానంలో తేలిపోయింది. బుధవారం బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో ఆర్సీబీని చిత్తు చేసింది. ఈ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన దినేశ్ కార్తీక్.. స్లో పిచ్ల కారణంగా తమ జట్టు ఓటమిపాలైందని అభిప్రాయపడ్డాడు. కేఎల్ రాహుల్ను ఔట్ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు.
'టీ20 క్రికెట్లో పరుగుల వరద పారితేనే అటు బ్రాడ్ కాస్టర్స్.. ఇటు అభిమానులకు పండుగ. ప్రేక్షకులు బౌండరీలనే ఎక్కువగా ఇష్టపడుతారు. మా రెండు హోమ్ మ్యాచ్లకు మంచి వికెట్ తయారు చేయాలని క్యూరెటర్ను కోరాం. బ్యాటింగ్ అనుకూలంగా ఉంటే పిచ్లు రెడీ చేయమని చెప్పాం. కానీ రెండు మ్యాచ్ల్లో స్లో వికెట్ తయారు చేశాడు.
ఈ రెండు పిచ్లు బ్యాటింగ్కు సవాల్గా మారాయి. అయినా మా బ్యాటర్లు క్రీజులో ఉండి పోరాడే ప్రయత్నం చేశారు. కానీ స్ట్రైక్ రొటేట్ చేయడం.. షాట్స్ ఆడటం కష్టమైంది. పిచ్కు తగ్గట్లు మా దూకుడును నియంత్రించుకునే ప్రయత్నం చేశాం. కానీ ఇది టీ20. షాట్స్ ఆడాల్సిందే. మా బ్యాటర్లు కొందరు పరుగులు రాబట్టారు. మేం క్యూరెటర్తో చర్చించే ప్రయత్నం చేస్తాం. అతనిపై మాకు నమ్మకం ఉంది. మా నుంచి మేం చేయాల్సింది చేస్తాం.
పిచ్ స్లోగా ఉన్నా.. మా ఆటగాళ్లు అద్భుతంగా పోరాడారు. బౌలర్లు చెలరేగడంతో ఢిల్లీ 50/4కే పరిమితమైంది. ట్రిస్టన్ స్టబ్స్, కేఎల్ రాహుల్లో ఒక్కరిని ఔట్ చేసినా మాకు విజయం దక్కేది. ఈ ఇద్దరూ హై క్వాలిటీ ఇంటర్నేషనల్ ప్లేయర్స్.'అని దినేశ్ కార్తీక్ చెప్పుకొచ్చాడు.