ఐపీఎల్ 2025 సీజన్ నేపథ్యంలో ఫ్రాంచైజీలు.. క్రికెట్ అసోసియేషన్స్ మధ్య వార్ కొనసాగుతోంది. సన్రైజర్స్ హైదరాబాద్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ల మధ్య గొడవ తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. కాంప్లిమెంటరీ పాస్ల కోసం హెచ్సీఏ బ్లాక్ మెయిల్ చేస్తుందని, హైదరాబాద్ను వీడుతామని సన్రైజర్స్ హైదరాబాద్ మెయిల్ చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. చివరకు హెచ్సీఏ తలొగ్గి చర్చలు జరపడంతో గొడవ సద్దుమణిగింది.
బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు..
తాజాగా రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్(ఆర్సీఏ), రాజస్థాన్ రాయల్స్ జట్టు మధ్య విభేదాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫిక్సింగ్కు పాల్పడిందంటూ రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్(ఆర్సీఏ) అడ్హక్ కమిటీ కన్వీనర్, బీజేపీ ఎమ్మెల్యే జైదీప్ బిహానీ ఆరోపించడం తీవ్ర చర్చనీయాంశమైంది. లక్నో సూపర్ జెయింట్స్తో జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోవడంపై జైదీప్ సందేహాలు వ్యక్తం చేశారు.

ఆఖరి ఓవర్లో ఓటమా..?
హోమ్ గ్రౌండ్లో విజయం ఖాయమనుకున్న దశలో ఎలా ఓడిపోయిందంటూ ప్రశ్నించారు. రాజస్థాన్ రాయల్స్ జట్టుపై విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్.. ఆర్సీఏకు విలువ ఇవ్వడం లేదని, పూర్తిగా పక్కనపెట్టిందని ఆరోపించారు. 'రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్లో రాష్ట్ర ప్రభుత్వం అడ్హక్ కమిటీని నియమించింది. ఈ కమిటీని ఐదోసారి పొడిగించింది. ఆర్సీఏ ఆధ్వర్యంలో జరిగే అన్ని మ్యాచ్లు ఎలాంటి సమస్యలు లేకుండా నిర్వహిస్తున్నాం. కానీ ఐపీఎల్ వచ్చే సరికి జిల్లా పరిషత్ బాధ్యతలు తీసుకుంటుంది.
ఐపీఎల్ నిర్వహణ కోసం బీసీసీఐ.. ఆర్సీఏకు మాత్రమే లేఖ పంపింది. కానీ సవాయి మాన్సింగ్ స్టేడియం నుంచి మాకు ఎంఓయూ లేదని రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ సాకు చెబుతోంది. ఏంఓయూ లేకపోతేనేం.. ప్రతీ మ్యాచ్కు జిల్లా పరిషత్కు రెంట్ చెల్లిస్తున్నారు? కదా?'అని జైదీప్ ప్రశ్నించారు. ప్రస్తుతం జైదీప్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఫిక్సింగ్ ఉదంతం నేపథ్యంలోనే గతంలో రాజస్థాన్ రాయల్స్పై రెండేళ్ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
గెలిచే మ్యాచ్లో ఓడిన రాజస్థాన్
గత శనివారం జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 2 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆఖరి ఓవర్లో 9 పరుగులు చేయలేక ఓటమికి తల వంచింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. ఎయిడెన్ మార్క్రమ్(45 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 66), ఆయుష్ బదోని(34 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్లతో 50) హాఫ్ సెంచరీలతో రాణించగా.. అబ్దుల్ సమద్(10 బంతుల్లో 4 సిక్స్లతో 30 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. రాజస్థాన్ బౌలర్లలో వానిందు హసరంగా(2/31) రెండు వికెట్లు తీయగా.. సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండే, జోఫ్రా ఆర్చర్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 178 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(52 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 74), వైభవ్ సూర్యవంశీ(20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 34), రియాన్ పరాగ్(26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 39) రాణించినా ఫలితం లేకపోయింది. లక్నో బౌలర్లలో ఆవేశ్ ఖాన్(3/37) మూడు వికెట్లతో రాజస్థాన్ పతనాన్ని శాసించగా.. శార్దూల్ ఠాకూర్, ఎయిడెన్ మార్క్రమ్ తలో వికెట్ తీసారు.