ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా భారీ సిక్సర్ బాదాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) శనివారం జరిగిన మ్యాచ్లో జడేజా కొట్టిన సిక్సర్కు బంతి చిన్నస్వామి స్టేడియం బయట పడింది. 109 మీటర్ల దూరంలో బంతి పడింది. ఈ సీజన్లోనే ఇది భారీ సిక్సర్గా నిలిచింది.
లుంగి ఎంగిడి వేసిన 17వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఐదో బంతిని ఎంగిడి ఫుల్టాస్ వేయగా.. జడేజా భారీ షాట్తో డీప్ స్క్వేర్ లెగ్ దిశగా బంతిని స్టేడియం బయట పడేసాడు. ఈ క్రమంలో జడేజా.. హెన్రీచ్ క్లాసెన్(107 మీటర్ల) భారీ సిక్సర్ను అధిగమించాడు. ఈ సీజన్లో జడేజా(109 మీటర్లు) తర్వాత క్లాసెన్(107 మీటర్లు, ఆండ్రీ రస్సెల్(106 మీటర్లు), అభిషేక్ శర్మ(106 మీటర్లు), ఫిల్ సాల్ట్(105 మీటర్లు) భారీ సిక్స్లు బాదిన జాబితాలో ఉన్నారు.

ఈ మ్యాచ్లో జడేజా(45 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో) అజేయ హాఫ్ సెంచరీతోరాణించినా.. సీఎస్కేకు ఓటమి తప్పలేదు. జడేజా భారీ సిక్సర్ బాదిన ఓవర్లోనే లుంగి ఎంగిడి.. తొలి రెండు బంతులకు ఆయుష్ మాత్రే(94), డెవాల్డ్ బ్రెవిస్(0)లను ఔట్ చేసి మ్యాచ్ను మలుపు తిప్పాడు. ఆఖరి ఓవర్లో యశ్ దయాల్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఆర్సీబీకి చిరస్మరణీయ విజయాన్నందించాడు. ఆఖరి 3 బంతుల్లో జడేజా-శివమ్ దూబే 6 పరుగులు చేయలేకపోయారు. దాంతో సీఎస్కే 2 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 213 పరుగుల భారీ స్కోర్ చేసింది. విరాట్ కోహ్లీ(33 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లతో 62), జాకోబ్ బెతెల్(33 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 55), రొమారియో షెపర్డ్(14 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్లతో 53 నాటౌట్)రాణించారు. సీఎస్కే బౌలర్లలో మతీష పతీరణ(3/36) మూడు వికెట్లు తీయగా.. నూర్ అహ్మద్, సామ్ కరణ్ చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 211 పరుగులు చేసి గెలుపొందింది. ఆయుష్ మాత్రే(48 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్లతో 94) తృటిలో శతకం చేజార్చుకోగా.. రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆర్సీబీ బౌలర్లలో లుంగి ఎంగిడి(3/30) మూడు వికెట్లు తీయగా.. కృనాల్ పాండ్యా, యశ్ దయాల్ చెరో వికెట్ పడగొట్టాడు.