ఐపీఎల్లోనే సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీ అయిన ముంబై ఇండియన్స్పై భారత మాజీ క్రికెటర్, సీఎస్కే వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసినట్లు సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఓటమి ఖాయమనుకునే మ్యాచ్ల్లో కూడా ముంబై ఇండియన్స్ విజయం సాధిస్తుందని, ఆ జట్టుకు ఉన్నంత లక్ మరే జట్టుకు ఉండదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో అశ్విన్ చెప్పుకొచ్చాడు. నేరుగా ఫిక్సింగ్ అనే పదం ఉపయోగించకున్నా.. ముంబై ఇండియన్స్ విషయంలో జరిగిన కొన్ని అసాధారణ సంఘటనలపై అతను అనుమానం వ్యక్తం చేశాడు.
అదేందో ఫ్లడ్ లైట్స్ ఆగిపోయాయి..
సీనియర్ జర్నలిస్ట్ విమల్ కుమార్ యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అశ్విన్ ముంబై ఇండియన్స్కు సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఐపీఎల్ 2018 సీజన్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా తాను ఉన్నప్పుడు ముంబైతో జరిగిన మ్యాచ్లోని ఓ ఘటనను అశ్విన్ గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 13 ఓవర్లలో 80/తో కష్టాల్లో ఉన్నప్పుడు, అకస్మాత్తుగా ఫ్లడ్లైట్లు ఆగిపోయి 20 నిమిషాల బ్రేక్ వచ్చిందని, ఆ తర్వాత తిరిగి ఆట ప్రారంభమవగానే కీరన్ పొలార్డ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి స్కోరును 180-200 దాటించాడని తెలిపాడు. ఇలాంటి సంఘటనలు ముంబై ఇండియన్స్కు తరచుగా జరుగుతాయని అశ్విన్ సందేహం వ్యక్తం చేశాడు.

'నేను ముంబై ఇండియన్స్ విషయంలో ఒక విషయాన్ని ప్రతిసారీ గమనించాను. 2018లో నేను పంజాబ్కు కెప్టెన్గా ఉన్నప్పుడు.. ముంబైతో జరిగిన మ్యాచ్లోఆ జట్టు 13 ఓవర్లలో ఐదు వికెట్లకు 80 ప్లస్ రన్స్ మాత్రమే చేసింది. ఆ సమయంలో ఆకస్మాత్తుగా ఫ్లడ్ లైడ్స్ ఆగిపోయాయి. దాంతో 20 నిమిషాల బ్రేక్ లభించింది. ఆ తర్వాత కీరన్ పొలార్డ్ విధ్వంసకర బ్యాటింగ్ ముంబై స్కోర్ను 180-200 పరుగులు ధాటించాడు. ముంబై ఇండియన్స్కు ఇలాంటి లక్ ఎప్పుడూ కలిసి వస్తుంది. అందరికి అదృష్టం ఉంటుంది. కానీ ముంబై ఇండియన్స్కు ఎప్పుడూ లక్ కలిసి వస్తుంది. వారికి అంత అదృష్టం ఎలా కలిసి వస్తుందో తెలుసుకోవాలి.'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
ఫిక్సింగ్ అనలేదు.. కానీ
అయితే ఈ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కొందరు నెటిజన్లు ముంబై ఇండియన్స్పై అశ్విన్ ఫిక్సింగ్ ఆరోపణలు చేశాడంటూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. అయితే అశ్విన్ ఎక్కడా ఫిక్సింగ్ ఆరోపణలు చేయలేదు. కానీ అసాధారణ పరిస్థితుల్లో ఆ జట్టుకు కలిసొచ్చే విషయాలపై సందేహం వ్యక్తం చేశాడు. ఐపీఎల్లో 5 టైటిళ్లు గెలిచిన ముంబై ఇండియన్స్పై తరుచూ ఫిక్సింగ్ ఆరోపణలు వినిపిస్తుంటాయి. ఆ జట్టు విజయాన్ని తట్టుకోలేని కొంతమంది అభిమానులు ఇలాంటి ప్రచారం చేస్తుంటారు.
ఐపీఎల్ 2025 సీజన్లో అనూహ్యంగా ప్లే ఆఫ్స్ చేరిన ముంబై ఇండియన్స్.. ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబైని ఓడించి క్వాలిఫయర్-2కు సిద్దమైంది. మరికొద్ది గంటల్లో అహ్మదాబాద్ వేదికగా ప్రారంభమయ్యే క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. ముంబై ఇండియన్స్ ఫైనల్ చేరకుంటేనే ఆర్సీబీ విజేతగా నిలుస్తుందని ఇప్పటికే అశ్విన్ తెలిపాడు.