ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. తమ నూతన కెప్టెన్గా రియాన్ పరాగ్ను ఎంపిక చేసింది. అయితే అతను ఐపీఎల్ 2025 ఆరంభ మ్యాచ్లకు మాత్రమే కెప్టెన్గా వ్యవహరిస్తాడని తెలిపింది.
ఐపీఎల్ 2025 సీజన్లోని తొలి 3 మ్యాచ్లకు రెగ్యులర్ కెప్టెన్ సంజూ శాంసన్ దూరమవడంతో పింక్ టీమ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఉప్పల్ వేదికగా మార్చి 23న సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగే మ్యాచ్తో రాజస్థాన్ రాయల్స్ తమ టైటిల్ వేటను ప్రారంభించనుంది. ఈ మ్యాచ్తో పాటు మరో రెండు మ్యాచ్లకు రియాన్ పరాగ్ సారథ్యం వహించనున్నాడు.

సొంతగడ్డపై ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో సంజూ శాంసన్ గాయపడిన విషయం తెలిసిందే. ఆఖరి టీ20లో సంజూ శాంసన్ వేలికి బలమైన గాయమైంది. ఆ గాయానికి శస్త్ర చికిత్స చేసుకున్న సంజూ శాంసన్.. ఎన్సీఏలో రిహాబిలిటేషన్ తీసుకున్నాడు.
ఐపీఎల్ ప్రమోషన్స్లో కూడా వేలికి కట్టుతోనే కనిపించాడు. గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో అతను ఆరంభ మ్యాచ్లకు దూరమయ్యే అవకాశం ఉంది. తొలి మూడు మ్యాచ్లకు అతను అందుబాటులో ఉండడని రాజస్థాన్ రాయల్స్ భావిస్తోంది. ఒకవేళ అందుబాటులో ఉన్న సంజూ శాంసన్ ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగనున్నాడు. సంజూ శాంసన్ పూర్తిగా కోలుకునే వరకు రియాన్ పరాగ్ జట్టును నడిపించే అవకాశాలు ఉన్నాయి.
సంజూ శాంసన్ తర్వాత ఆ స్థాయి సీనియర్ ఆటగాళ్లు లేకపోవడంతో రియాన్ పరాగ్కు సారథ్య బాధ్యతలు అప్పగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతేడాది వరకు జట్టులో ఉన్న జోస్ బట్లర్ ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు టీమ్ను వీడాడు. హెట్మైర్, యశస్వి జైస్వాల్ ఉన్నప్పటికీ.. కెప్టెన్సీ వారి ఆటపై ప్రభావం చూపుతుందనే కారణంతో రియాన్ పరాగ్కు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దేశవాళీ క్రికెట్లో తమ జట్టును రియాన్ పరాగే నడుపుతున్నాడు. దాంతోనే అతనివైపు రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ మొగ్గు చూపినట్లు అర్థమవుతోంది. గత సీజన్లో రియాన్ పరాగ్ మెరుగైన ప్రదర్శన చేశాడు.
ఐపీఎల్ 2025లో తొలి మూడు మ్యాచ్లను రాజస్థాన్ రాయల్స్.. మార్చి 23న సన్రైజర్స్తో, మార్చి 26న కోల్కతా నైట్ రైడర్స్తో, మార్చి 30న చెన్నై సూపర్ కింగ్స్తో తలపడనుంది.