టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మళ్లీ ఐపీఎల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నాడని ఓ ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ పేర్కొంది. టీ20 ప్రపంచకప్ 2024 విజయంతో రాహుల్ ద్రవిడ్.. టీమిండియా హెడ్ కోచ్ పదవి కాలం ముగిసిన విషయం తెలిసిందే.
11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత హెడ్ కోచ్గా భారత్కు ఐసీసీ ఐటిల్ అందించిన రాహుల్ ద్రవిడ్.. మళ్లీ ఐపీఎల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. గతంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్గా, డైరెక్టర్గా వ్యవహరించిన రాహుల్ ద్రవిడ్.. ఇప్పుడు హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నాడు.

హెడ్ కోచ్గా ఒప్పందం పూర్తి..
ఇటీవలే రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీతో రాహుల్ ద్రవిడ్ ఒప్పందం కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. అయితే ఈ నియామకంపై రాజస్థాన్ రాయల్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన రాహుల్ ద్రవిడ్.. ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించి కూడా చర్చలు జరిపినట్లు సమాచారం.
ముఖ్యంగా ఆటగాళ్ల రిటెన్షన్తో పాటు వేలంలో ఫోకస్ చేయాల్సిన ఆటగాళ్ల గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది. రాహుల్ ద్రవిడ్తో పాటు టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ కూడా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో ఒప్పందం కుదర్చుకున్నట్లు సమాచారం. రాజస్థాన్ రాయల్స్ అసిస్టెంట్ కోచ్గా అతను ఎంపికైనట్లు ఆ జట్టు వర్గాలు పేర్కొన్నాయి.
విక్రమ్ రాథోడ్ సైతం..
టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ ఉన్న సమయంలోనే విక్రమ్ రాథోడ్ బ్యాటింగ్ కోచ్గా సేవలు అందించాడు. అతని పదవి కాలం కూడా టీ20 ప్రపంచకప్ 2024 విజయంతోనే ముగిసింది. నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)కి రాహుల్ ద్రవిడ్ డైరెక్టర్గా ఉన్నప్పుడు కూడా విక్రమ్ రాథోడ్ ఇంచార్జ్గా వ్యవహరించాడు.
కెప్టెన్గా ఆడిన అనుభవం..
రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుత హెడ్ కోచ్ కుమార్ సంగక్కర.. డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలకే చెందిన పార్ల్ రాయల్స్(సౌతాఫ్రికా టీ20 లీగ్), బార్బోడస్ రాయల్స్(సీపీఎల్) జట్లకు కూడా కుమార సంగక్కర హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతనిపై వర్క్లోడ్ తగ్గించేందుకు రాహుల్ ద్రవిడ్ను తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ 2012- 13 సీజన్లలో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సారథిగా వ్యవహరించిన రాహుల్ ద్రవిడ్.. 2013 ఛాంపియన్స్ లీగ్ టీ20 ఫైనల్కు తీసుకెళ్లాడు. 2014, 2015లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ డైరెక్టర్గా వ్యవహరించాడు. ఆ తర్వాత 2016లో ఢిల్లీ క్యాపిటల్స్కు హెడ్ కోచ్గా వెళ్లిన రాహుల్ ద్రవిడ్.. ఆ తర్వాత ఎన్సీఏ డైరెక్టర్గా సేవలందించాడు. అనంతరం టీమిండియా హెడ్ కోచ్గా 2021లో బాధ్యతలు చేపట్టాడు.