ఐపీఎల్ మెగా వేలంలో రైట్ టు మ్యాచ్(ఆర్టీఎమ్) రూల్ ద్వారా ఆటగాళ్లకు తీవ్ర అన్యాయం జరుగుతుందని టీమిండియా వెటరన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఈ నిబంధనతో ఫ్రాంచైజీలు మాత్రమే లాభపడుతాయని, ఆటగాళ్లకు తీరని నష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్ 2025 సీజన్ నేపథ్యంలో ఈ ఏడాది చివర్లో మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మెగావేలం నిర్వహణపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఫోకస్ పెట్టింది. ఫ్రాంచైజీ ఓనర్లతో సమావేశం నిర్వహించి మెగా వేలానికి సంబంధించి సలహాలు, సూచనలను స్వీకరించింది.

ఆటగాళ్ల రిటెన్షన్ విషయంలో ఫ్రాంచైజీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. గరిష్టంగా 8 మంది ఆటగాళ్ల వరకు రిటైన్ చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఒక్కో జట్టుకు మూడు ఆర్టీఎమ్లు ఇవ్వాలని ఫ్రాంచైజీలు డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. రైట్ టు మ్యాచ్(ఆర్టీఎమ్) ద్వారా వేలంలోకి వెళ్లిన తమ పాత ఆటగాళ్లను తిరిగి తీసుకునే వెసులుబాటు ఫ్రాంచైజీలకు ఉంటుంది. అయితే ఈ రూల్తో ఫ్రాంచైజీలకే మేలు జరుగుతుందని అశ్విన్ తెలిపాడు. తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఆర్టీఎమ్ ద్వారా ఆటగాళ్లకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించాడు.
'ఆర్టీమ్ కంటే ఆటగాళ్లకు మించిన అన్యాయం మరొకటి లేదు. ఎందుకంటే ఆర్టీమ్ రూల్ అలా ఉంది. ఉదాహరణకు X అనే ఆటగాడు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉన్నాడు. అతని విలువ రూ. 5 నుంచి 6 కోట్లుగా ఉంది. సన్రైజర్స్ హైదరాబాద్ అతన్ని వేలంలోకి విడిచిపెడితే రూ. 2 కోట్ల కనీస ధర నుంచి ఇతర ఫ్రాంచైజీలు బిడ్ వేస్తాయి.
సదరు ఆటగాడి కోసం కేకేఆర్, ముంబై ఇండియన్స్ తీవ్రంగా పోటీపడి అతన్ని రూ. 6 కోట్లకు ఓ జట్టు దక్కించుకుంటే.. ఆర్టీఎమ్ ద్వారా సన్రైజర్స్ అతన్ని తీసుకుంటుంది. ఇక్కడ సన్రైజర్స్ సంతోషంగా ఉంటుంది. కానీ ఆటగాడికి ఒరిగే ప్రయోజనం ఏం లేదు. కేకేఆర్, ముంబై ఇండియన్స్ తీవ్రంగా పోటీపడి సదరు ఆటగాడిని దక్కించుకుంటే.. సన్రైజర్స్ ఆర్టీఎమ్ ద్వారా సదరు ఆటగాడిని ఇచ్చేయండని చెబుతుంది. ఇక్కడ ఆటగాడికి విలువ లేకుండా పోయింది.
ఒక్కో ఫ్రాంచైజీకి మూడు ఆర్టీఎమ్లు ఇస్తే తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఐపీఎల్ మెగా వేలానికి అర్థమే ఉండదు.'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది డిసెంబర్లో మెగా వేలం నిర్వహించే అవకాశం ఉంది.