ఐపీఎల్ 2025 సీజన్లో అద్వితీయమైన ప్రదర్శనతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన క్వాలిఫయర్-1లో పంజాబ్ కింగ్స్ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసిన ఆర్సీబీ.. 18 ఏళ్ల కలను సాకారం చేసుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. నాలుగో సారి ఫైనల్ చేరిన ఆర్సీబీ ఈ సారి టైటిల్ గెలుస్తుందని మాజీ క్రికెటర్లు, అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ మాత్రం.. ఆర్సీబీ టైటిల్ గెలవాలంటే ముంబై ఇండియన్స్ ఫైనల్కు రావద్దని అభిప్రాయపడ్డాడు.
ఒకవేళ ముంబై ఇండియన్స్ ఫైనల్కు వస్తే మాత్రం ఆర్సీబీకి మరోసారి నిరాశ తప్పదన్నాడు. 'ఐపీఎల్ 2025 సీజన్లో ఆర్సీబీ విజేతగా నిలవాలంటే ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై గుజరాత్ టైటాన్స్ గెలవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ముంబై ఫైనల్లో అడుగు పెట్టకుండా ఉంటేనే.. ఆర్సీబీకి విజయం దక్కుతుంది. ఆర్సీబీ బలంగా కనిపిస్తున్నప్పటికీ.. క్రికెట్లో ఏదైనా జరగొచ్చు. నేను ఆర్సీబీ ప్లేయర్ను అయితే మాత్రం గుజరాత్ టైటాన్స్తో ఫైనల్ ఆడాలని కోరుకుంటాను.

ఈ ఏడాది ఆర్సీబీదిలా కనిపిస్తోంది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఒకవేళ ఫైనల్లో ఆర్సీబీ ఛేజింగ్ చేయాల్సి వస్తే ఆ పరిస్థితులను ఎలా తమకు అనుకూలంగా మార్చుకోవాలో విరాట్ కోహ్లీకి బాగా తెలుసు.'అని రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా చెప్పుకొచ్చాడు.
క్వాలిఫయర్-2లో గెలిచే జట్టుతో జూన్ 3న అహ్మదాబాద్ వేదికగా జరిగే ఫైనల్లో ఆర్సీబీ తలపడుతుంది. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో గెలిచే జట్టుతో పంజాబ్ కింగ్స్ క్వాలిఫయర్-2 ఆడుతోంది. క్వాలిఫయర్-2లో గెలిచే జట్టు ఫైనల్ చేరుతోంది. ముంబై ఇండియన్స్ ఫైనల్ చేరవద్దని అశ్విన్ కోరుకుంటుండగా.. ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం ఆ జట్టుపైనే ఫైనల్ గెలిచి విజేతగా నిలవాలని ఆకాంక్షిస్తున్నారు.