ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్ 204 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. సూర్యకుమార్ యాదవ్(26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 44), తిలక్ వర్మ(29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 44)లతో పాటు నమన్ ధీర్(18 బంతుల్లో 7 ఫోర్లతో 37) రాణించడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 203 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ రెండు వికెట్లు తీయగా.. కైల్ జెమీసన్, మార్కస్ స్టోయినీస్, విజయ్కుమార్ వైశాఖ్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీసారు.
నిరాశపర్చిన రోహిత్..
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్కు ఆశించిన శుభారంభం దక్కలేదు. మార్కస్ స్టోయినీస్ వేసిన మూడో ఓవర్లోనే ఓపెనర్ రోహిత్ శర్మ(8) క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మతో కలిసి మరో ఓపెనర్ జానీ బెయిర్ స్టో దూకుడుగా ఆడాడు. తిలక్ వర్మ సైతం బ్యాట్కు పని చెప్పడంతో ముంబై స్కోర్ బోర్డు వేగంగా కదిలింది. దాంతో పవర్ ప్లేలో ముంబై వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది. హాఫ్ సెంచరీ దిశగా సాగిన జానీ బెయిర్ స్టో(38)ను విజయ్ కుమార్ వైశాఖ్ కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో రెండో వికెట్కు నమోదైన 51 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

ఆదుకున్న సూర్య, తిలక్..
క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ తన జోరును కొనసాగించాడు. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. తిలక్ సైతం వేగంగా ఆడటంతో 10 ఓవర్లలోనే ముంబై 100 పరుగులు పూర్తి చేసుకుంది. క్రీజులో సెట్ అయిన ఈ జోడీని చాహల్ విడదీసాడు. హాఫ్ సెంచరీకి చేరువైన సూర్యకుమార్ యాదవ్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే చాహల్ను కూడా జెమీసన్ ఔట్ చేయడంతో మూడో వికెట్కు నమోదైన 72 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్ దూకుడుగా ఆడారు. కానీ హార్దిక్(15)ను ఒమర్జాయ్ కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. హార్దిక్ ఔటైనా నమన్ ధీర్ దూకుడుగా ఆడాడు. ఆఖరి ఓవర్లో అతన్ని ఒమర్జాయ్ ఔట్ చేయగా.. రాజ్బావా జట్టు స్కోర్ను 200 ధాటించాడు.