పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే మూడు వేర్వేరు జట్లను ఫైనల్ చేర్చిన తొలి కెప్టెన్గా నిలిచాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్తో ఆదివారం జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్లో సమష్టిగా రాణించిన పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఫైనల్కు అర్హత సాధించిన పంజాబ్.. మంగళవారం జరిగే టైటిల్ ఫైట్లో మరోసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో తలపడనుంది.
ఐపీఎల్ 2020 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్కు సారథ్యం వహించిన శ్రేయస్ అయ్యర్.. ఆ జట్టును టాప్ ప్లేస్లో నిలిపడమే కాకుండా ఫైనల్కు తీసుకెళ్లాడు. గతేడాది కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్) కెప్టెన్గా ఆ జట్టును ఫైనల్కు తీసుకెళ్లడమే కాకుండా టైటిల్ కూడా అందించాడు. తాజాగా పంజాబ్ కింగ్స్ను ఫైనల్ చేర్చాడు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో మరే కెప్టెన్ కూడా ఈ ఫీట్ సాధించలేదు. శ్రేయస్ అయ్యర్ సూపర్ కెప్టెన్సీతో 11 ఏళ్ల తర్వాత పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ చేరడమే కాకుండా ఫైనల్కు కూడా అర్హత సాధించింది. ఫైనల్లో విజయం సాధిస్తే పంజాబ్ కింగ్స్ తొలి టైటిల్ను ముద్దాడనుంది. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ ఫైనల్ చేరడం ఇది రెండోసారి మాత్రమే. 2014లో ఆ జట్టు ఫైనల్ చేరినా కేకేఆర్ చేతిలో ఓటమిపాలైంది.

వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 203 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 44), తిలక్ వర్మ(29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 44)లతో పాటు నమన్ ధీర్(18 బంతుల్లో 7 ఫోర్లతో 37) రాణించారు. పంజాబ్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ రెండు వికెట్లు తీయగా.. కైల్ జెమీసన్, మార్కస్ స్టోయినీస్, విజయ్కుమార్ వైశాఖ్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీసారు.
అనంతరం పంజాబ్ కింగ్స్ 19 ఓవర్లలో 207 పరుగులు చేసి గెలుపొందింది. శ్రేయస్ అయ్యర్తో పాటు నెహాల్ వధేరా(29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 48), జోష్ ఇంగ్లీస్(21 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 38) రాణించారు. ముంబై బౌలర్లలో అశ్వని కుమార్ రెండు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ పడగొట్టారు.