శ్రేయస్ అయ్యర్ అద్భుత బ్యాటింగ్తో పాటు బౌలింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. ప్రణాళికలకు తగ్గట్లు బౌలింగ్ చేయలేకపోయామని తెలిపాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో ఆదివారం జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్లో సమష్టిగా విఫలమైన ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో ముంబై టోర్నీ నుంచి నిష్క్రమించగా.. పంజాబ్ ఫైనల్కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన హార్దిక్ పాండ్యా.. బుమ్రా వైఫల్యం తమ విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు. గత మ్యాచ్ల తరహాలో బుమ్రా అద్భుతం చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు.
అయ్యర్ అద్భుతం..
'శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేసిన తీరు.. అతను రిస్క్ తీసుకున్న విధానం, ఆడిన షాట్స్ అద్భుతం. పంజాబ్ కింగ్స్ మెరుగ్గా బ్యాటింగ్ చేసింది. అయితే ఇది డిఫెండ్ చేసుకోగలిగే లక్ష్యమే. కానీ మా బౌలింగ్ యూనిట్ నుంచి ఆశించిన ప్రదర్శన రాలేదు. ఇలాంటి బిగ్ మ్యాచ్ల్లో ప్రణాళికలకు తగ్గట్లు బౌలింగ్ చేయడం చాలా ముఖ్యం. పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు చాలా ప్రశాంతంగా ఆడారు. మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టారు. దాంతో మా ప్రణాళికలను మేం సమర్థవంతంగా అమలు చేయలేకపోయాం. కెప్టెన్గా నేను కూడా తడబడ్డాను. మేం ఇంకాస్త మెరుగ్గా రాణించాల్సింది.

బుమ్రా ప్రత్యేకత లేదు..
సరైన లెంగ్త్లో బౌలింగ్ చేయడం, సరైన సమయంలో సరైన బౌలర్ను ఉపయోగించడం వంటివి చేసుంటే ఫలితం మరోలా ఉండేది. బుమ్రా బౌలింగ్ విషయంలో ఏది సరైనదని కచ్చితంగా చెప్పలేం. 17వ ఓవర్ వేయించి ఉంటే మరి తొందరయ్యేది.(ఆ సమయంలో పంజాబ్ విజయానికి 4 ఓవర్లలో 41 పరుగులు అవసరమయ్యాయి) బుమ్రాకు పరిస్థితి తెలుసు. 18 బంతులే మిగిలి ఉన్నా అతను తనదైన శైలిలో బౌలింగ్ చేసి మా కోసం ఏదైన ప్రత్యేకంగా చేసేవాడు. దురదృష్టవశాత్తు అది ఈ రోజు జరగలేదు.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.
204 టార్గెట్ కాపాడుకోలేకపోయిన ముంబై..
వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 203 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 44), తిలక్ వర్మ(29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 44)లతో పాటు నమన్ ధీర్(18 బంతుల్లో 7 ఫోర్లతో 37) రాణించారు. పంజాబ్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ రెండు వికెట్లు తీయగా.. కైల్ జెమీసన్, మార్కస్ స్టోయినీస్, విజయ్కుమార్ వైశాఖ్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీసారు.
అనంతరం పంజాబ్ కింగ్స్ 19 ఓవర్లలో 207 పరుగులు చేసి గెలుపొందింది. శ్రేయస్ అయ్యర్తో పాటు నెహాల్ వధేరా(29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 48), జోష్ ఇంగ్లీస్(21 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 38) రాణించారు. ముంబై బౌలర్లలో అశ్వని కుమార్ రెండు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ పడగొట్టారు.