ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ పోరాటం ముగిసింది. అద్వీతీయమైన ప్రదర్శనతో క్వాలిఫయర్-2కు దూసుకొచ్చిన ఆ జట్టుకు పంజాబ్ కింగ్స్ ఊహించని షాకిచ్చింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన క్వాలిఫయర్-2లో సమష్టిగా రాణించిన పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ను ఓడించింది. శ్రేయస్ అయ్యర్(41 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్లతో 87 నాటౌట్)విధ్వంసకర బ్యాటింగ్తో పంజాబ్ కింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ ఓటమితో హార్దిక్ పాండ్యా తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఆపుకోలేకపోయాడు. భారీ సిక్సర్తో శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ ముగించిన వెంటనే మైదానంలో కుప్పకూలిన హార్దిక్ పాండ్యా భావోద్వేగానికి గురయ్యాడు. తన కన్నీళ్లను చేతులతో దాచుకున్నాడు. టైటిల్ గెలిచే అవకాశం రెండడుగుల దూరంలో చేజారడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. హార్దిక్ పాండ్యాను స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, పంజాబ్ కింగ్స్ ప్లేయర్ మార్కస్ స్టోయినీస్ ఓదార్చారు.

ఈ ఓటమితో ముంబై జట్టు మొత్తం తీవ్ర నిరాశకు గురైంది. టీమ్ ఓనర్స్ నుంచి సపోర్ట్ స్టాఫ్, ఆటగాళ్లంతా నిరాశలో కూరుకుపోయారు. ధారళంగా పరుగులిచ్చిన యువ పేసర్ అశ్వని కుమార్ను జస్ప్రీత్ బుమ్రా ఓదార్చాడు. మరోవైపు పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్, ఓనర్స్ ఆనందంతో ఎగిరి గంతేసారు. ప్రస్తుతం ఇరు జట్ల రియాక్షన్స్కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.
వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 203 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 44), తిలక్ వర్మ(29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 44)లతో పాటు నమన్ ధీర్(18 బంతుల్లో 7 ఫోర్లతో 37) రాణించారు. పంజాబ్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ రెండు వికెట్లు తీయగా.. కైల్ జెమీసన్, మార్కస్ స్టోయినీస్, విజయ్కుమార్ వైశాఖ్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీసారు.
అనంతరం పంజాబ్ కింగ్స్ 19 ఓవర్లలో 207 పరుగులు చేసి గెలుపొందింది. శ్రేయస్ అయ్యర్తో పాటు నెహాల్ వధేరా(29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 48), జోష్ ఇంగ్లీస్(21 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 38) రాణించారు. ముంబై బౌలర్లలో అశ్వని కుమార్ రెండు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ పడగొట్టారు.