ఐపీఎల్ 2025 మెగా వేలానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఏర్పాట్లు చేస్తోంది. సౌదీ అరెబీయాలోని జెడ్డా వేదికగా నవంబర్ 24, 25 తేదీల్లో మెగా వేలం నిర్వహించనున్నారు. ఇప్పటికే 10 ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాలను ప్రకటించాయి. వేలంలో కొనుగోలు చేసే ఆటగాళ్లకు సంబంధించి వ్యూహాలు రచిస్తున్నాయి.
మెగా వేలంలో టీమిండియా స్టార్ క్రికెటర్లు రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇప్పటికే ఐపీఎల్ మెగా వేలంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఆసక్తిని రెట్టింపు చేసేలా టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. మాక్ ఆక్షన్ నిర్వహించాడు. చెన్నై ఆటగాళ్లు, అభిమానుల సాయంతో నిర్వహించిన ఈ మాక్ ఆక్షన్లో అశ్విన్ ఆక్షనీర్గా వ్యవహరించాడు. ఈ వేలానికి సంబంధించి 20 మంది ఆటగాళ్లు ఏయే జట్టుకు వెళ్లారో ఓ వీడియోను అశ్విన్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా పంచుకున్నాడు.

ఈ వీడియో ప్రకారం స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ను పంజాబ్ కింగ్స్ రూ. 20.50 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. రాజస్థాన్ రాయల్స్ వదిలేసిన జోస్ బట్లర్ను గుజరాత్ టైటాన్స్ రూ. 16 కోట్లకు తీసుకుంది. అదేవిధంగా కగిసో రబడాను పంజాబ్ కింగ్స్ రూ. 10 కోట్లకు ఎంచుకోగా.. కేఎల్ రాహుల్ను ఢిల్లీ క్యాపిట్స్ రూ. 18 కోట్లకు కొనుగోలు చేసింది.
విధ్వంసకర బ్యాటర్ గ్లేన్ మ్యాక్స్వెల్ను పంజాబ్ కింగ్స్ రూ. 9.5 కోట్లకు తీసుకోగా.. దీపక్ చాహర్ను ఆర్సీబీ రూ. 5.5 కోట్లకు, డేవిడ్ మిల్లర్ రూ. 8 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. అర్ష్దీప్ సింగ్ను పంజాబ్ కింగ్స్ రూ. 13.52 కోట్లకు ఆర్టీఎమ్ కార్డ్తో దక్కించుకుంది.
కేకేఆర్ మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ను అదే జట్టు రూ. 9.5 కోట్లకు తిరిగి కొనుగోలు చేయగా.. ఆల్టైమ్ రికార్డ్ ధర పలికిన మిచెల్ స్టార్క్ను ముంబై ఇండియన్స్ రూ. 14 కోట్లకు తీసుకుంది. రవిచంద్రన్ అశ్విన్ను చెన్నై సూపర్ కింగ్స్ రూ. 8.5 కోట్లకు కొనుగోలు చేసింది. స్టార్ ఆల్రౌండర్ మార్కస్ స్టోయినీస్ను రూ. 12 కోట్లకు ఆర్టీమ్ కార్డ్ ద్వారా లక్నో తిరిగి దక్కించుకుంది. ట్రెంట్ బౌల్ట్ను ఆర్సీబీ రూ. 13 కోట్లకు కొనుగోలు చేయగా.. మహమ్మద్ షమీని గుజరాత్ టైటాన్ రూ. 12 కోట్లకు తీసుకుంది. ఈ మాక్ ఐపీఎల్ వేలం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.