ఐపీఎల్ 2025 సీజన్లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ అసాధారణ ప్రదర్శన చేస్తుంటే.. మరోవైపు ఆ జట్టు యజమానులు అనవసర వివాదాలతో కోర్టుకెక్కారు. అయ్యర్ అసాధారణ కెప్టెన్సీ.. పాంటింగ్ పర్యవేక్షణ.. కుర్రాళ్ల అద్భుత ప్రదర్శనతో పంజాబ్ కింగ్స్ 11 ఏళ్ల తర్వాత ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. టాప్-2 ప్లేస్కు పంజాబ్ కింగ్స్ చేరువవ్వగా.. మరోవైపు ఆ జట్టు ఓనర్ల మధ్య వివాదం చెలరేగింది.
ఆ జట్టు సహ యాజమాని, బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింటా కోర్టుకెక్కింది. జట్టు సహ యజమానులైన మోహిత్ బుర్మాన్, నెస్ వాడియాపై ఆమె చండీగడ్ కోర్టులో కేసు వేసింది. నిబంధనలకు విరుద్దంగా ఈ ఇద్దరూ సమావేశం నిర్వహించి కొత్త డైరెక్టర్గా మునీశ్ ఖన్నాను నియమించారని, ఆ నియామకాన్ని నిలిపివేయాలని తన పిటిషన్లో పేర్కొంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కంపెనీ అమలు చేయకుండా చూడాలని కోరింది. ఈ కేసు పరిష్కారమయ్యేవరకు తాను, కరణ్పాల్ లేకుండా బోర్డు సమావేశాలు నిర్వహించకుండా చూడాలని ప్రీతి జింటా తన పిటిషన్లో కోర్టును కోరింది.

నెస్ వాడియా, ప్రీతి జింటా, మోహిత్ బర్మాన్ ముగ్గురు కేపీహెచ్ డ్రీమ్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లుగా ఉన్నారు. పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ ఈ కంపెనీదే. గత నెల 21న నిర్వహించిన కంపెనీ సర్వసభ్య సమావేశంలో ప్రీతి జింటా, మరో డైరెక్టర్ కరణ్ పాల్తో కలిసి హాజరైంది. అయితే ఈ సమావేశంలో మునీశ్ ఖన్నాను డైరెక్టర్గా నియమించడాన్ని ఈ ఇద్దరూ వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే వివాదం చెలరేగింది. కంపెనీ రూల్స్, ఇతర సెక్రటేరియల్ నిబంధనలకు విరుద్ధంగా ఈ సమావేశం నిర్వహించారని ఆమె ఆరోపించింది. ఈ భేటీకి సంబంధించిన అభ్యంతరాలను ప్రీతి జింటా ఈమెయిల్ రూపంలో తెలియజేసినప్పటికీ పట్టించుకోలేదని ఆమె తన పిటిషన్లో పేర్కొంది.
నెస్ వాడియాతో ప్రీతి జింటాకు విభేదాలు తలెత్తడం ఇదే తొలిసారి కాదు. 2014 ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా నెస్ వాడియా తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని, లైంగిక వేధింపులకు గురి చేశాడని ఆరోపించింది. నెస్ వాడియాపై ముంబైలోని మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేసింది. ఆ కేసును కోర్టు కొట్టేసి బయటే పరిష్కరించుకోవాలని చెప్పింది.