ఐపీఎల్ 2025 సీజన్ రీస్టార్ట్కు వరణుడు అడ్డంకిగా మారాడు. రివైజ్డ్ షెడ్యూల్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ), కోల్కతా నైట్రైడర్స్ మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగాల్సిన మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. బెంగళూరులో భారీ వర్షం కురుస్తోంది. దాంతో మైదానం చెరువును తలపిస్తోంది. అరేబియా సముద్రంలో అల్పపీడనం కారణంగా గత నాలుగు రోజులుగా బెంగళూరులో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా సాయంత్రం వేళలో వర్షాలు పడుతున్నాయి.
చిన్నస్వామి మైదానాన్ని గ్రౌండ్స్మెన్ కవర్లతో కప్పేసారు. టాస్ కూడా ఇంకా వేయలేదు. ఒకవేళ వర్షం ఆగినా.. మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోవచ్చు. గత నాలుగు రోజులుగా వర్షం పడుతుండటంతో ఔట్ ఫీల్డ్ మొత్తం చిత్తడిగా మారింది. చిన్నస్వామి స్టేడియంలో అధునాతన డ్రైనేజీ వ్యవస్థ ఉండటం కలిసొచ్చే అంశం. మళ్లీ వర్షం రాకుండా ఆగితే మాత్రం మ్యాచ్ సాధ్యమవుతోంది. ఇరు జట్లు కనీసం 5 ఓవర్లు ఆడితేనే మ్యాచ్ ఫలితం తేలుతుంది.

ప్లే ఆఫ్స్కు ఆర్సీబీ.. కానీ?
ఒకవేళ ఈ మ్యాచ్ రద్దయితే కేకేఆర్ ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారుతాయి. మరోవైపు ఆర్సీబీ అధికారికంగా ప్లే ఆఫ్స్ బెర్త్ను దక్కించుకుంటుంది. ప్రస్తుతం ఆర్సీబీ 11 మ్యాచ్ల్లో 8 విజయాలు16 పాయింట్స్తో పాయింట్స్ టేబుల్లో రెండో స్థానంలో కొనసాగుతోంది. కేకేఆర్తో మ్యాచ్ రద్దయితే ఆర్సీబీ ఖాతాలో ఒక పాయింట్ చేరుతుంది. అప్పుడు 17 పాయింట్స్తో ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం అవుతోంది. కాకపోతే ఆ జట్టు టాప్-2 ప్లేస్లో నిలవాలంటే చివరి రెండు మ్యాచ్లు గెలవాల్సి ఉంటుంది.
కేకేఆర్ సంక్లిష్టం..
కేకేఆర్ 12 మ్యాచ్ల్లో 5 విజయాలు, ఓ మ్యాచ్ రద్దుతో 11 పాయింట్స్తో ఆరో స్థానంలో కొనసాగుతోంది. తాజా మ్యాచ్ రద్దయితే ఆ జట్టు ఖాతాలో ఓ పాయింట్ చేరి 12 పాయింట్స్ దక్కించుకుంటుంది. ఆఖరి మ్యాచ్ గెలిచినా 14 పాయింట్స్ ఖాతాలో ఉంటాయి. అప్పుడు ఇతర జట్ల ఫలితాలు, నెట్రన్రేట్పై ప్లే ఆఫ్స్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. కేకేఆర్ రన్రేట్ 0.193 కూడా గొప్పగా లేదు.
4 స్థానాల కోసం 7 జట్లు పోటీ..
ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం మొత్తం 7 జట్ల మధ్య పోటీ నెలకొంది. ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మెరుగైన అవకాశాలు ఉండగా.. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తమ చివరి మ్యాచ్ల్లో విజయం సాధించాల్సి ఉంది. కేకేఆర్, లక్నో జట్లు తమ చివరి మ్యాచ్ల్లో గెలిచినా.. ఇతర జట్ల ఫలితాలపై ప్లే ఆఫ్స్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.