టీమిండియా వెటరన్ స్పిన్నర్ పియూష్ చావ్లా తన రిటైర్మెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్తో పాటు ఆయన కుమారుడు అర్జున్ టెండూల్కర్తో కూడా ఆడానని గుర్తు చేశాడు. ముంబై యువ బ్యాటర్ పృథ్వీ షా కుమారుడితో ఆడిన తర్వాతే రిటైర్మెంట్ ప్రకటిస్తానని చమత్కరించాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి.
35 ఏళ్ల పియూష్ చావ్లా ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. తన వయసు ఆటగాళ్లంతా ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకగా.. పియూష్ చావ్లా మాత్రం ఇంకా కెరీర్ కొనసాగిస్తున్నాడు.

తాజాగా ఓ షోలో పృథ్వీ షాతో కలిసి పాల్గొన్న పియూష్ చావ్లా తనదైన వ్యాఖ్యలతో నవ్వులు పూయించాడు. ఐపీఎల్ నుంచి ముందుగా మీరు రిటైర్ అవుతారా? లేక ధోనీనా..? అని హోస్ట్ అడగ్గా.. పియూష్ చావ్లా ధోనీనే అని బదులిచ్చాడు.
వెంటనే పృథ్వీ షా 'ఇక ఆడింది చాలా బ్రో.. మీరు రిటైర్మెంట్ ప్రకటించండి'అని అన్నాడు. ఈ వ్యాఖ్యలకు చావ్లా తనదైన శైలిలో బదులిచ్చాడు. 'అప్పుడు సచిన్ టెండూల్కర్తో ఆడాను. ఆయన కుమారుడితో కూడా కలిసి ఆడాను. ఇప్పుడు నీతోనూ ఆడుతున్నాను. భవిష్యత్తులో నీ కుమారుడితో కూడా ఆడిన తర్వాతే రిటైర్ అవుతాను'అని బదులిచ్చాడు. దాంతో అక్కడ నవ్వులు పూసాయి.
పియూష్ చావ్లా 2007లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ధోనీ సారథ్యంలో భారత్ గెలిచిన 2007, 2011 ప్రపంచకప్ల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. నాలుగేళ్ల క్రితం ధోనీ రిటైర్మెంట్ ప్రకటించినా.. పియూష్ చావ్లా మాత్రం ఇంకా ఆడుతూనే ఉన్నాడు. అంతర్జాతీయ మ్యాచ్లకు దూరమైనా.. దేశవాళీ, ఐపీఎల్ ఆడుతున్నాడు.