ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మపై పంజాబ్ కింగ్స్ ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ నోరు పారేసుకున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఆదివారం జరిగిన కీలక క్వాలిఫయర్-2 మ్యాచ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ(7 బంతుల్లో ఫోర్తో 8) తీవ్రంగా నిరాశపరిచాడు. మార్కస్ స్టోయినీస్ వేసిన మూడో ఓవర్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. రోహిత్ శర్మ ఔటైన వెంటనే మార్కస్ స్టోయినిస్ దూకుడుగా సంబరాలు చేసుకున్నాడు. ఈ క్రమంలో నోటికి పనిచెప్పాడు. రాయలేని పదాలతో రోహిత్ శర్మను స్టోయినిస్ తిట్టినట్లు అనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. రోహిత్ శర్మ వైఫల్యంతో ముంబై ఇండియన్స్కు ఆశించిన శుభారంభం దక్కలేదు.

మరోవైపు రోహిత్ శర్మపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కీలక మ్యాచ్లో బాధ్యాతాయుతంగా ఆడాల్సిన రోహిత్ శర్మ ఇలా ఔటవ్వడం బాలేదని మండిపడుతున్నారు. వడపావ్ అంటూ ట్రోల్ చేశారు. రోహిత్ శర్మ అనంతరం క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ.. మరో ఓపెనర్ జానీ బెయిర్ స్టోతో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఈ ఇద్దరూ దూకుడుగా ఆడటంతో పవర్ ప్లేలో ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది. క్రీజులో సెట్ అయిన జానీబెయిర్ స్టోను విజయ్ కుమార్ వైశాఖ్ పెవిలియన్ చేర్చాడు. దాంతో రెండో వికెట్కు నమోదైన 51 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్యతో కలిసి తిలక్ వర్మ చెలరేగుతున్నాడు.