ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరగాల్సిన కీలక క్వాలిఫయర్-2కు మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. సరిగ్గా మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికే భారీ వర్షం రావడంతో ఆట మొదలవ్వలేదు. సిబ్బంది మైదానాన్ని కవర్లతో కప్పేసారు. మధ్యలో ఆగిన వర్షం మళ్లీ మొదలవ్వడంతో మ్యాచ్ సజావుగా జరిగే పరిస్థితులు కనిపించడం లేదు.
అహ్మదాబాద్లో వర్షం నేపథ్యంలో బీసీసీఐపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు నాకౌట్ మ్యాచ్లను అహ్మదాబాద్ ఎందుకు తరలించారని ప్రశ్నిస్తున్నారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ ప్లే ఆఫ్స్ మ్యాచ్లు హైదరాబాద్, కోల్కతా వేదికగా జరగాల్సి ఉంది. కానీ వర్షం పడుతుందనే సూచనలతో ఈ మ్యాచ్లను ముల్లాన్పూర్, అహ్మదాబాద్లకు తరలించారు. ముల్లాన్పూర్ వేదికగా క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ సజావుగా జరిగాయి. కానీ అహ్మాదాబాద్ వేదికగా జరగాల్సిన క్వాలిఫయర్-2కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. దాంతో ఫ్యాన్స్ నిర్వహాకులపై మండిపడుతున్నారు.

వర్ష ప్రభావం ఉన్న అహ్మదాబాద్కు ఎందుకు మ్యాచ్లు తరలించారని ప్రశ్నిస్తున్నారు. గుజరాత్ పెత్తనం కాకపోతే.. ఏంది? ఇది అని మండిపడుతున్నారు. ప్రముఖ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ కూడా బీసీసీఐ తీరును తప్పుబడుతూ ట్వీట్ చేశాడు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఓవర్కాస్ట్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. మరోవైపు హార్దిక్ పాండ్యా కూడా టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకునేవాడినని తెలిపాడు.
ఇరు జట్లలో ఒక్కో మార్పు చోటు చేసుకుంది. పంజాబ్ కింగ్స్లోకి యుజ్వేంద్ర చాహల్ రీఎంట్రీ ఇవ్వగా.. ముంబై ఇండియన్స్ జట్టులోకి రీస్ టోప్లీ వచ్చాడు. రిచర్డ్ గ్లీసన్ గాయపడటంతో టోప్లీకి అవకాశం దక్కింది.
క్వాలిఫయర్-2 మ్యాచ్ కోసం రిజర్వ్ డే లేదు. కాకపోతే కటాఫ్ టైమ్ను అదనంగా గంటవరకు పొడిగించారు. ఈ లెక్కన అర్థరాత్రి 12 గంటల వరకు అంపైర్లు వేచిచూస్తారు. కనీసం 5 ఓవర్ల మ్యాచ్ నిర్వహించేందుకు ప్రయత్నిస్తారు. ఇరు జట్లు 5 ఓవర్లు ఆడితేనే ఫలితం తేలుతోంది. లేదంటే టోర్నీ నిబంధనల ప్రకారం పాయింట్స్ టేబుల్లో మెరుగైన ర్యాంక్లో ఉన్న జట్టు టోర్నీలో ముందడుగు వేస్తోంది. ఈ లెక్కన పంజాబ్ కింగ్స్ ఫైనల్ చేరుతోంది. మ్యాచ్ జరగాలని క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.