ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ధర్మశాల వేదికగా గురువారం జరగాల్సిన మ్యాచ్ రద్దయ్యింది. భద్రతా కారణాల నేపథ్యంలో ఈ మ్యాచ్ను అర్థాంతరంగా రద్దు చేసినట్లు తెలుస్తోంది. జమ్మూ కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ ప్రజల శ్రేయస్సు కోసం ఈ మ్యాచ్ను మధ్యలో నిలిపివేసినట్లు అర్థమవుతోంది. భారత సాయుధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు ప్రతీకారంగా పాకిస్థాన్ నుంచి దాడులు జరగుతాయనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల నేపథ్యంలో ఈ మ్యాచ్ను నిలిపివేసినట్లు సమాచారం.
ముందుగా ఫ్లడ్ లైట్స్ ఆపేసి ప్రేక్షకులను మైదానం నుంచి బయటకు తరలించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. మరోవైపు సాంకేతిక కారణాల వల్ల ఈ మ్యాచ్ రద్దయ్యిందని అధికారిక బ్రాడ్ కాస్టర్ జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్ ప్రకటించాయి. ఐపీఎల్ నిర్వాహకులు కూడా మ్యాచ్ రద్దయ్యిందని పేర్కొన్నారు. కానీ కారణాలు వెల్లడించలేదు.

ఢిల్లీ అవకాశాలు సంక్లిష్టం..
వర్షం కారణంగా గంట ఆలస్యంగా ఈ మ్యాచ్ ప్రారంభమైంది. మ్యాచ్ నిలిపేసే సమయానికి పంజాబ్ కింగ్స్ 10.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 122 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య(34 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్లతో 70), ప్రభ్సిమ్రాన్ సింగ్(50) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో నటరాజన్ ఏకైక వికెట్ తీసాడు. ఈ మ్యాచ్ రద్దవ్వడంతో ఇరు జట్లకు చెరొక పాయింట్ లభించింది. దాంతో పంజాబ్ కింగ్స్ 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్కు మరింత దగ్గరవ్వగా.. ఢిల్లీ క్యాపిటల్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఆ జట్టు చివరి రెండు మ్యాచ్లకు రెండు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆపరేషన్ సిందూర్..
జమ్మూ కశ్మీర్లో గత నెల 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత త్రివిధ దళాలు మంగళవారం ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్థాన్లోని ఉగ్రవాదుల శిబిరాలపై మెరుపు దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో సుమారు 100 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు తెలుస్తోంది. పహల్గాంలో భారత స్త్రీల సిందూరాన్ని నేల రాల్చిన వారి మీద ప్రతీకార చర్యగా 'ఆపరేషన్ సిందూర్'అని ఈ దాడికి నామకరణం చేశారు. అయితే ఈ ఆపరేషన్ నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాయాదీ దేశాల మధ్య యుద్దం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పాక్ మిస్సైల్ను పేల్చేసిన భారత సైన్యం..
ఇప్పటికే పాకిస్థాన్ సరిహద్దులకు సమీపంగా ఉండే 18 విమానాశ్రయాలను భారత ప్రభుత్వం తాత్కలికంగా మూసి వేసింది. ఇందులో ధర్మశాలతో పాటు ఛండీఘడ్, అమృత్ సర్, జమ్మూ, శ్రీనగర్ విమానాశ్రయాలు కూడా ఉన్నాయి. ఆపరేషన్ సిందూర్కు ప్రతీకారంగా పాకిస్థాన్ దాడులకు ప్రయత్నిస్తుంది. మిసైల్స్తో దాడికి దిగుతోంది. పాక్ విస్సైల్ను భారత బలగాలు గాల్లోనే పేల్చేసాయి. లాహోర్లోని కీలక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ధ్వంసం చేసాయి.
ఈ ఘటన పంజాబ్-ఢిల్లీ మ్యాచ్పై ప్రభావం చూపించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ మ్యాచ్ను వాయిదా వేస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఆపరేషన్ సిందూర్కు ముందే పంజాబ్, ఢిల్లీ జట్లు ధర్మశాలకు చేరుకోవడంతో ఈ మ్యాచ్ను నిర్వహించేందుకు బీసీసీఐ మొగ్గు చూపింది. ఇదే వేదికపై ఆదివారం జరగాల్సిన పంజాబ్-ముంబై మ్యాచ్ను అహ్మదాబాద్కు తరలించింది.