ఐపీఎల్ 2025 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ సిద్దమవుతోంది. ఐపీఎల్ 2024 సీజన్ పేలవ ప్రదర్శన నేపథ్యంలో జట్టు ప్రక్షాళనపై ముంబై ఇండియన్స్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే రిటెన్షన్ జాబితాను సిద్దం చేయడంతో పాటు వేలంలో కొనుగోలు చేయాల్సిన ఆటగాళ్లపై కసరత్తు చేస్తోంది.
మరోవైపు కోచింగ్ విభాగంలో భారీ మార్పులు చేస్తోంది. ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్గా వ్యవహరించిన మార్క్ బౌచర్ను తొలిగించి మళ్లీ మహేల జయవర్దనేకు ఆ బాధ్యతలు అప్పగించింది. తాజాగా టీమిండియా మాజీ బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రేను కోచింగ్ బృందంలోకి తీసుకుంది. ప్రస్తుతం బౌలింగ్ కోచ్గా ఉన్న లసిత్ మలింగాతో కలిసి పరాస్ మాంబ్రే పనిచేయనున్నాడు.

పరాస్ మాంబ్రే నియామకానికి సంబంధించి ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటనను విడుదల చేసింది. పరాస్ మాంబ్రే గతంలో ముంబై ఇండియన్స్ సపోర్ట్ స్టాఫ్గా బాధ్యతలు నిర్వర్తించాడు. టీమిండియా టీ20 ప్రపంచకప్ 2024 గెలవడంలో పరాస్ మాంబ్రే బౌలింగ్ కోచ్గా కీలక పాత్ర పోషించాడు. అదే తరహా ఫలితాన్ని రాబట్టేందుకు ముంబై ఇండియన్స్ కోచ్ అతన్ని నియమించినట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ 2025 మెగా వేలం నిర్వహణపై బీసీసీఐ ఫోకస్ పెట్టింది. నవంబర్ 31న మెగా వేలం నిర్వహించేందుకు కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ రూల్స్ను ప్రకటించింది. ప్రతీ జట్టుకు ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకునే అవకాశం కల్పించింది. ఇందులో గరిష్టంగా ఐదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లు ఉండాలనే నిబంధన పెట్టింది.
విదేశీ ఆటగాళ్లపై ఎలాంటి పరిమితి విధించలేదు. ఆరుగురి ఆటగాళ్లను నేరుగా రిటైన్ చేసుకోవచ్చు లేదా ఆర్టీఎమ్ కార్డ్ ద్వారా వేలంలో తిరిగి కొనుగోలు చేయవచ్చు. రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు, రూ.11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగు, అయిదో ఆటగాడిని తీసుకోవాలనుకుంటే తిరిగి రూ.18 కోట్లు, రూ.14 కోట్లు చెల్లించాలి.
అన్క్యాప్డ్ ప్లేయర్ను రిటైన్ చేసుకుంటే మాత్రం రూ.4 కోట్లు చెల్లించాలి. ఫ్రాంచైజీల పర్స్ వాల్యూను రూ. 120 కోట్లకు పెంచారు. అక్టోబర్ 31వ తేదీలోపు రిటెన్షన్ జాబితాలను సమర్పించాలని ఫ్రాంచైజీలను బీసీసీఐ ఆదేశించింది.