ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ రూల్స్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్టీఎమ్తో పాటు మొత్తం ఆరుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఫ్రాంచైజీల పర్స్ వాల్యూను రూ. 120 కోట్లకు పెంచిన బీసీసీఐ.. గరిష్టంగా ఐదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరూ అనామక ఆటగాళ్లను తీసుకోవాలని చెప్పింది.
ఐదేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన భారత ఆటగాళ్లను అనామక ఆటగాళ్లుగా పరిగణించే పాత్ రూల్ను మళ్లీ ప్రవేశ పెట్టింది. అక్టోబర్ 31లోపు ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాలను సమర్పించాలని ఆదేశించింది.

దాంతో ఐపీఎల్ 2025 మెగా వేలంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏయే ఆటగాళ్లు వేలంలోకి వస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ను వీడుతాడనే వార్తలు హాట్ టాపిక్గా మారాయి. ఒకవేళ రోహిత్ వేలంలోకి వేస్తే అతను భారీ ధర పలుకుతాడని మాజీ క్రికెటర్లు జోస్యం చెబుతున్నారు.
తాజాగా ఓ జాతీయ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. రోహిత్ వేలంలోకి వస్తే అతని కోసం ఫ్రాంచైజీలు ఎగబడుతాయని చెప్పాడు. 'రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకుంటుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ అతను వేలంలోకి వస్తే మాత్రం.. రోహిత్ కోసం ఏ జట్టు పోటీపడుతుందో అనేది చూడటానికి రసవత్తరంగా ఉంటుంది. కచ్చితంగా రోహిత్ శర్మ కోసం ఫ్రాంచైజీలు ఎగబడుతాయి.
రోహిత్ శర్మ అద్భుతమైన ఆటగాడు. సూపర్ కెప్టెన్. టాప్ క్వాలిటీ కెప్టెన్, ప్లేయర్. ఇప్పటికే మ్యాచ్ విన్నర్గా నిరూపించుకున్నాడు. 37 ఏళ్ల వయసులో ఉన్నా అతను ఇంకా చాలా క్రికెట్ ఆడగలడు. రోహిత్ వేలంలోకి వస్తే మాత్రం అతను భారీ ధర పలికే ఛాన్స్ ఉంది. వేలం మొత్తం ఆసక్తికరంగా మారనుంది.'అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.
ఒకవేళ రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ ప్రథమ ఆటగాడిగా రిటైన్ చేసుకోవాలంటే రూ. 18 కోట్లు చెల్లించాలి. రెండో, మూడో రిటెన్ష్గా తీసుకుంటే రూ. 14 కోట్లు, రూ. 11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగో, ఐదో ఆటగాడిగా రిటైన్ చేసుకోవాలనుకుంటే రూ. 18 కోట్లు, 14 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా కాకుండా వేలంలో ఇతర జట్టు కొనుగోలు చేసినా.. ఆర్టీఎమ్ కార్డ్ ద్వారా తిరిగి జట్టులోకి తీసుకురావచ్చు. ఒకవేళ ముంబై రిటైన్ చేసుకుంటానని చెప్పినా.. అందుకు రోహిత్ శర్మ ఒప్పుకోడనే ప్రచారం జోరుగా సాగుతోంది.