ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్నర్ నూర్ అహ్మద్ మరోసారి రఫ్ఫాడించాడు. దాంతో ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 179 పరుగులు చేసింది. అజింక్యా రహానే(33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 48) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకోగా.. ఆండ్రీ రస్సెల్(21 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 38), మనీష్ పాండే(28 బంతుల్లో ఫోర్, సిక్స్తో 36 నాటౌట్) పర్వాలేదనిపించారు. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్(4/31) నాలుగు వికెట్లు తీయగా.. అన్షుల్ కంబోజ్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసారు.
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన కేకేఆర్కు శుభారంభం దక్కలేదు. ఓ సిక్స్, బౌండరీ బాదిన రెహ్మానుల్లా గుర్బాజ్(11) అన్షూల్ కంబోజ్ వేసిన రెండో ఓవర్లోనే క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన రహానే, మరో ఓపెనర్ సునీల్ నరైన్ దూకుడుగా ఆడటంతో పవర్ప్లేలో కేకేఆర్ వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. దూకుడుగా ఆడుతున్న సునీల్ నరైన్(26)ను నూర్ అహ్మద్ పెవిలియన్ చేర్చి 58 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. అదే ఓవర్లో క్రీజులోకి వచ్చిన అంఘ్క్రిష్ రఘువంశీ(1)ని కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు.

ఈ పరిస్థితుల్లో మనీష్ పాండేతో కలిసి రహానే ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. తనదైన షాట్లతో పరుగులు రాబట్టాడు. హాఫ్ సెంచరీకి చేరువైన అతన్ని జడేజా క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన రస్సెల్ దూకుడుగా ఆడాడు. భారీ సిక్సర్లతో పాటు బౌండరీలు బాదడంతో కేకేఆర్ స్కోర్ బోర్డు పరుగెత్తింది. అతన్ని నూర్ అహ్మద్ ఔట్ చేయడంతో కేకేఆర్ పరుగుల వేగం తగ్గింది. దూకుడుగా ఆడే క్రమంలోనే రింకూ సింగ్ ఔటవ్వగా.. మనీష్ పాండే మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు.