ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ రూల్స్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. మొత్తం ఆరుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఇందులో ఒక ఆర్టీఎమ్ కార్డు కూడా ఉంది. ప్రతీ ఫ్రాంచైజీ అట్టిపెట్టుకున్న ఐదుగురి ఆటగాళ్ల కోసం రూ.75 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
టీమ్ పర్స్ వాల్యూను రూ. 120 కోట్లకు పెంచారు. రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు వరుసగా రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు, రూ. 11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగు, ఐదో ఆటగాడిని తీసుకోవాలనుకుంటే తిరిగి రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు చెల్లించాలి. అక్టోబర్ 31లోపు రిటెన్షన్ జాబితాలను సమర్పించాలని 10 ఫ్రాంచైజీలను బీసీసీఐ ఆదేశించింది. దాంతో ఫ్రాంచైజీలన్నీ రిటెన్షన్ లిస్ట్పై ఫోకస్ పెట్టాయి.

రోహిత్ విడుదల..
ఇప్పటికే ముంబై ఇండియన్స్ తమ రిటెన్షన్ జాబితాను సిద్దం చేసినట్లు తెలుస్తోంది. మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ అయిన ముంబై ఇండియన్స్కు సంబంధించి అనేక ఊహగానాలు వెలువడుతున్నాయి. కెప్టెన్గా ముంబై ఇండియన్స్ను ఐదుసార్లు ఛాంపియన్గా నిలబెట్టిన రోహిత్ శర్మ.. ఆ జట్టు వీడేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.
తనను కాదని హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పగించడంపై రోహిత్ అసంతృప్తిగా ఉన్నట్లు గతేడాదిగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు హార్దిక్ పాండ్యాను కూడా రిలీజ్ చేసేందుకు ముంబై సిద్దమైనట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ ఇద్దరి ఆటగాళ్ల విషయంలో ముంబై ఇండియన్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ రోహిత్ శర్మ తనకు కెప్టెన్సీ ఆఫర్ చేసే జట్టులోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
బుమ్రా, సూర్య..
ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకునే ఆటగాళ్లను పరిశీలిస్తే.. జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా టాప్లో ఉన్నారు. వెటరన్ స్పిన్నర్ పియూష్ చావ్లాను అన్క్యాప్డ్ రూల్గా రూ. 4 కోట్లు చెల్లించి రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఇషాన్ కిషన్, తిలక్ వర్మలను ఆర్టీఎమ్ కార్డ్ కింద తిరిగి కొనుగోలు చేయవచ్చు.
ఆటగాళ్లను రిటెన్షన్ ధరలను బీసీసీఐ ఖరారు చేసినా.. అవి గరిష్టం.. తప్పనిసరిగా అంతే ధరకు తీసుకోవాలా? అనేదానిపై క్లారిటీ లేదు. ముంబై ఇండియన్స్ వర్గాల ప్రకారం హార్దిక్ పాండ్యాను రూ. 15 కోట్లకు, జస్ప్రీత్ బుమ్రాను రూ. 12 కోట్లకు, సూర్యకుమార్ యాదవ్ను రూ. 8 కోట్లకు రిటైన్ చేసుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్టీఎమ్ కార్డ్ కింద తిలక్ వర్మకు రూ. 2 కోట్లు, ఇషాన్ కిషన్కు రూ. 15.25 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.