ఐపీఎల్ 2024 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ యువ ప్లేయర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 15 మ్యాచ్ల్లో 2 హాఫ్ సెంచరీలతో 303 పరుగులు చేశాడు. బౌలింగ్లో 3 వికెట్లు తీసాడు. ఈ ప్రదర్శనతో ఐపీఎల్ 2024 సీజన్లో ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు అందుకున్నాడు.
తెలుగు టీమ్లో తెలుగోడు సత్తా చాటడం రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులను సంతోషంలో ముంచెత్తింది. అయితే వచ్చే ఏడాది మెగా వేలం జరగనున్న నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్.. నితీష్ కుమార్ రెడ్డిని రిటైన్ చేసుకుంటుందా? లేదా? అనే చర్చ జోరుగా సాగుతోంది.

ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటైన్ పాలసీ అయితే ఇంకా ఖరారు కాలేదు. కానీ 3+1 రిటెన్షన్కు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఫ్రాంచైజీలు ముగ్గురిని నేరుగా రిటైన్ చేసుకోనుండగా.. మరొకరిని ఆర్టీఎమ్(రైట్ టు మ్యాచ్) కింద తీసుకోవచ్చు.
ఈ రూల్ ప్రకారం వేలంలో ఏదైనా జట్టు తమ ఆటగాడిని కొనుగోలు చేస్తే ఆర్టీఎమ్ కింద ఆ ధరను చెల్లించి రిటైన్ చేసుకోవచ్చు. రిటైన్ పాలసీ ప్రకారం ఒక జట్టు గరిష్టంగా నలుగురిని(3+1) మాత్రమే అంటిపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇందులో ముగ్గురు భారత క్రికెటర్లు, ఒక విదేశీ క్రికెటర్ లేదా ఇద్దరు భారత క్రికెటర్లు, ఇద్దరు విదేశీ క్రికెటర్లు మాత్రమే ఉండాలి.
నితీష్ రెడ్డిని రిటైన్ చేసుకున్నా అతనికి కనీసం రూ. 6 కోట్ల ధర దక్కనుంది. ఒక వేలంలోకి వదిలేసినా.. ఈ తెలుగు కుర్రాడి కోసం ఫ్రాంచైజీలు ఎగబడనున్నాయి. ముఖ్యంగా ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, కేకేఆర్, సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ ఈ తెలుగు కుర్రాడి కోసం వేలంలో పోటీ పడనున్నాయి. బ్యాటింగ్ చేయడంతో పాటు బౌలింగ్ చేసే సామర్థ్యం ఉండటం నితీష్ కుమార్ రెడ్డికి కలిసొచ్చే అంశం.
వేలంలోకి వస్తే నితీష్ కుమార్ రెడ్డి సులువుగా రూ. 6 కోట్లకు పైనే పలకనున్నాడు. అయితే అతను ఈ ఏడాది జరగనున్న ముస్తాక్ అలీ ట్రోఫీతో పాటు రంజీ ట్రోఫీలో నిలకడగా రాణించడం కీలకం.