రాజస్థాన్ రాయల్స్ చిచ్చర పిడుగు, ఐపీఎల్ బుడ్డోడు వైభవ్ సూర్యవంశీపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. సూర్య వంశీ మరో సచిన్ అవుతాడని, భారత క్రికెట్ను ఏలుతాడని నెటిజన్లు జోస్యం చెబుతన్నారు. 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్లోకి అరంగేట్రం చేసి సరికొత్త చరిత్ర సృష్టించిన ఈ బిహార్ కుర్రాడు.. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్గా తరలించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఫియర్లెస్ గేమ్తో లక్నో బౌలర్లపై విరుచుకుపడిన సూర్య.. తన రాకను ఘనంగా చాటుకున్నాడు.
తొలి మ్యాచ్ ఆడుతున్నాననే బెరుకు లేకుండా స్పిన్నర్లు, పేసర్లను అలవోకగా ఆడేసాడు. చాలా ఆత్మవిశ్వాసంగా కనిపించిన ఈ కుర్రాడు.. చూడముచ్చటైన షాట్లతో ప్రేక్షకులను కనువిందు చేశాడు. 14 ఏళ్ల వయసే అయినా.. తన ఆటలో ఎంతో మెచ్యూరిటీ చూపించాడు. మంచి రిథమ్తో బ్యాటింగ్ చేసిన సూర్యవంశీ అరంగేట్ర మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ దురదృష్టవశాత్తు బ్యాలెన్స్ కోల్పోయిన అతను స్టంపౌట్గా వెనుదిరిగాడు.

ఎయిడెన్ మార్క్రమ్ బౌలింగ్లో లెగ్ సైడ్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన సూర్యవంశీ బ్యాలెన్స్ కోల్పోయాడు. బంతిని అందుకున్న పంత్ ఎలాంటి తప్పిదం చేయకుండా స్టంప్ ఔట్ చేశాడు. దాంతో 20 బంతుల్లో 2 ఫోర్లు 3 సిక్స్లతో 34 పరుగులు చేసిన సూర్యవంశీ ఇన్నింగ్స్కు తెరపడింది. అయితే హాఫ్ సెంచరీ సాధించలేదన్న బాధో.. లేక అతని పసితనమో తెలియదు కానీ.. ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఆపుకోలేకపోయాడు. ఏడుస్తూనే పెవిలియన్ బాట పట్టాడు. ఈ సన్నివేశం ప్రేక్షకుల హృదయాలను దోచేసింది.
'ముందు ముందు నీకోసం చాలా మంది ఏడుస్తార్రా.. చిన్నోడా.'అని కామెంట్ చేస్తున్నారు. 14 ఏళ్ల వయసులో వరల్డ్ బెస్ట్ లీగ్ ఆడటం అంటే మాటలా? అని అవాక్కవుతున్నారు. సూర్యకు మంచి భవిష్యత్తు ఉందని, మరో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలా ఎదుగుతాడని జోస్యం చెబుతున్నారు. అతని ఫియర్లెస్ బ్యాటింగ్కు ఫిదా అయిన నెటిజన్లు.. 'ఏ గుండెరా అది'అని కామెంట్ చేస్తున్నారు. 'నీ ధైర్యానికి.. సెల్యూట్రా చిన్నోడా'అని కొనియాడుతున్నారు.