పంజాబ్ కింగ్స్ యువ ప్లేయర్, టీమిండియా టెస్ట్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో గురువారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ తరఫున ముషీర్ ఖాన్ ఐపీఎల్లోకి అరంగేట్రం చేశాడు. ముందుగా తుది జట్టులో లేని ముషీర్ ఖాన్.. పంజాబ్ కింగ్స్ టాపార్డర్ కుప్పకూలడంతో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగాడు. కానీ అతను బ్రాంజ్ డక్గా వెనుదిరిగాడు.
వాస్తవానికి ఇంపాక్ట్ ప్లేయర్గా విజయ్ కుమార్ వైశాఖ్ను ఆడించాలని పంజాబ్ కింగ్స్ భావించింది. కానీ టాపార్డర్ కుప్పకూలడంతో తప్పని పరిస్థితుల్లో స్పెషలిస్ట్ బ్యాటర్గా ముషీర్ ఖాన్కు అవకాశం ఇచ్చింది. కానీ అతను కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. బౌలింగ్లో మాత్రం 2 ఓవర్లు బౌలింగ్ చేసి 27 పరుగులిచ్చి ఓ వికెట్ తీసాడు.

ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా..
ఈ మ్యాచ్ ఆడటం ద్వారా ముషీర్ ఖాన్ అరుదైన సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ ప్లే ఆఫ్ మ్యాచ్ ద్వారా టీ20 ఫార్మాట్లోకి అరంగేట్రం చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఈ మ్యాచ్కు ముందు అతను దేశవాళీ క్రికెట్లో ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. అసలు అతను వైట్ బాల్ క్రికెట్లోనే ఇప్పటి వరకు అరంగేట్రం చేయలేదు. దేశవాళీ క్రికెట్లో ముంబైకి ఆడుతున్న ముషీర్ ఖాన్.. 11 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు మాత్రమే ఆడాడు. అతన్ని పంజాబ్ కింగ్స్ వేలంలో రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. కానీ ఒక్క మ్యాచ్లో అవకాశం ఇవ్వలేదు. క్వాలిఫయర్-1లో తప్పనిసరి పరస్థితుల్లో ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడించింది. దాంతో ముషీర్ ఖాన్ టీ20ల్లోకి అరంగేట్రం చేశాడు.
సన్నీ గుప్తా తర్వాత..
ఇప్పటి వరకు 84 మంది ఆటగాళ్లు ఐపీఎల్ ద్వారా టీ20 ఫార్మాట్లోకి అరంగేట్రం చేయగా.. ఎవరూ కూడా ప్లే ఆఫ్స్ మ్యాచ్ ద్వారా పొట్టి ఫార్మాట్ను మొదలు పెట్టలేదు. 2012లో చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన ప్లే ఆఫ్స్ మ్యాచ్లో ఢిల్లీ డేర్ డేవిల్స్ తరఫున సన్నీ గుప్తా ఐపీఎల్లోకి అరంగేట్రం చేశాడు. అతని తర్వాత ప్లే ఆఫ్స్ మ్యాచ్తో ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆటగాడిగా ముషీర్ నిలిచాడు. ముషీర్ ఖాన్ సోదరుడు సర్ఫరాజ్ ఖాన్ కూడా ఐపీఎల్ ఆడాడు. దాంతో ఐపీఎల్ ఆడిన సోదరుల జాబితాలో ఈ ఖాన్ బ్రదర్స్ నిలిచారు.
పంజాబ్ ఓటమి..
క్వాలిఫయర్-1లో పంజాబ్ కింగ్స్ను ఆర్సీబీ 8 వికెట్లతో చిత్తు చేసి ఫైనల్కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 14.1 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఆర్సీబీ 10 ఓవర్లలోనే 2 వికెట్లకు 106 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ముంబై-గుజరాత్ ఎలిమినేటర్ మ్యాచ్లో గెలిచే జట్టుతో ఆదివారం జరిగే క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్ తమ అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోనుంది.