ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ పాలసీని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. ప్రతీ ఫ్రాంచైజీకి గరిష్టంగా ఐదుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడంతో పాటు ఓ ఆర్టీఎమ్ కార్డ్కు అవకాశం ఇచ్చింది. అంతేకాకుండా పర్స్ వాల్యూను రూ. 120 కోట్లకు పెంచింది.
రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు గరిష్టంగా రూ. 18 కోట్లు చెల్లించాలని, అనామక ప్లేయర్లకు రూ. 4 కోట్లు ఇవ్వాలని పేర్కొంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) విజ్ఞప్తి మేరకు ఓ పాత రూల్ను మళ్లీ ప్రవేశపెట్టింది. అంతర్జాతీయ క్రికెట్కు ఐదేళ్ల పాటు దూరమైన భారత ఆటగాళ్లను అనామక ప్లేయర్గా పరిగణించే నిబంధనకు మళ్లీ అనుమతిచ్చింది.

ధోనీ కోసం మళ్లీ పాత రూల్..
ఈ రూల్ ప్రకారం టీమిండియా దిగ్గజ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ఆ జట్టు అనామక ఆటగాడిగా రూ. 4 కోట్లకే రిటైన్ చేసుకోనుంది. ధోనీ కోసమే ఈ రూల్ మళ్లీ పెట్టారని స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఐపీఎల్ రిటెన్షన్ పాలసీని రూపొందించే ముందు బీసీసీఐ.. 10 ఫ్రాంచైజీలతో సమావేశమైంది. వారి సలహాలు, సూచనలను స్వీకరించింది.
ఈ సమయంలో ఐదేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన భారత ఆటగాళ్లను అనామక ప్లేయర్గా పరిగణించే పాత రూల్ను మళ్లీ ప్రవేశ పెట్టాలని సీఎస్కే బీసీసీఐని కోరినట్లు వార్తలు వచ్చాయి. 2018 మెగా వేలం వరకు ఈ రూల్ అమల్లో ఉండగా.. 2022 మెగా వేలంలో తొలగించారు.
వ్యతిరేకించిన కావ్యమారన్..
సీఎస్కే డిమాండ్ను సన్రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్యా మారన్ వ్యతిరేకించినట్లు కూడా వార్తలు వచ్చాయి. దిగ్గజ ఆటగాడైన ధోనీని అనామక ప్లేయర్గా పరిగణించడం సరికాదని ఆమె అభిప్రాయపడినట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంలో సీఎస్కేకు ముంబై ఇండియన్స్ పూర్తి మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది.
తమ వ్యాపార ప్రయోజనాల నేపథ్యంలోనే ఈ రూల్ను మళ్లీ ప్రవేశ పెట్టాలని ముంబై కూడా డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. రిలయన్స్ సంస్థకు చెందిన జియో సినిమానే ఐపీఎల్కు అధికారిక ఓటీటీ బ్రాడ్కాస్టర్గా వ్యవహరిస్తోంది. ఐపీఎల్ 2024 సీజన్లో ధోనీ ఆడిన సమయంలో వ్యూయర్షిప్ బాగా పెరిగింది. ఇది దృష్టిలో పెట్టుకొనే ముంబై ఇండియన్స్.. సీఎస్కేకు మద్దతు ఇచ్చినట్లు సమాచారం.
మరోవైపు బీసీసీఐ కూడా ధోనీ ఆడితేనే.. కమర్షియల్గా బోర్డుకు లాభం చేకూరుతుందని, స్పాన్సర్స్కు కలిసొస్తుందని భావించి ఆ పాత రూల్ను మళ్లీ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.