ఐపీఎల్ 2025 సీజన్కు రంగం సిద్దమైంది. మరో 8 రోజుల్లో ఈ క్యాష్ రిచ్ లీగ్కు తెరలేవనుంది. మ్యాచ్ 22న డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య కోల్కతా వేదికగా జరిగే తొలి మ్యాచ్తో ఈ ధనాధన్ లీగ్ ప్రారంభం కానుంది. ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తమ తొలి మ్యాచ్ను ముంబై ఇండియన్స్తో ఆడనుంది. మార్చి 23న చెన్నైలోని చెపాక్ మైదానం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
రెండు మాజీ ఛాంపియన్స్ మధ్య హోరా హోరీ పోరు ఉంటుందని క్రికెట్ విశ్లేషకులతో పాటు అభిమానులు భావిస్తున్నారు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు ఐదేసి సార్లు విజేతగా నిలిచాయి. ఈ క్రమంలోనే ఇరు జట్ల మధ్య తొలిపోరే బ్లాక్బాస్టర్ అవుతందని అంతా అనుకున్నారు. కానీ ఈ మ్యాచ్కు ముందే ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్ తగిలింది.

హార్దిక్ పాండ్యా దూరం..
చెన్నైతో పోరుకు ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాళ్లు ఇద్దరూ దూరం కానున్నారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా సైతం చెన్నైతో మ్యాచ్ ఆడలేని పరిస్థితి నెలకొంది. గత సీజన్లో అతను వరుసగా మూడు సార్లు స్లో ఓవర్రేట్కు కారణమవ్వడంతో హార్దిక్ పాండ్యాపై ఓ మ్యాచ్ నిషేధం పడింది. స్లో ఓవర్ రేట్ రూల్స్ ప్రకారం.. మూడు సార్లు తప్పిదాన్ని రిపీట్ చేస్తే కెప్టెన్ మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధించడంతో పాటు ఓ మ్యాచ్ నిషేధం విధిస్తారు.
గ్రూప్ దశలోనే ముంబై ఇండియన్స్ స్లో ఓవర్ రేట్కు గురైంది. ఆ జట్టు ప్లేఆఫ్లోకి ప్రవేశించకపోవడంతో హార్దిక్ పాండ్యాపై ఓ మ్యాచ్ నిషేధం విధించడం సాధ్యం కాలేదు. ఈ క్రమంలో ఐపీఎల్ 2025 సీజన్లో తొలి మ్యాచ్లోనే హార్దిక్ పాండ్యా ఆ నిషేధాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురైంది. దాంతో చెన్నైతో జరిగే మ్యాచ్కు పాండ్యా దూరం కానున్నాడు.
ఆరంభ మ్యాచ్లకు బుమ్రా దూరం..
మరోవైపు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్లకు దూరం కానున్నాడు. వెన్ను గాయంతో బాధపడుతున్న బుమ్రా ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది. ప్రస్తుతం అతను బెంగళూరులోని ఎన్సీఏలో రిహాబిలిటేషన్ తీసుకుంటున్నాడు. బుమ్రా పూర్తిగా కోలుకునేందుకు ఇంకాస్త సమయం పడుతుందని, అతను ఏప్రిల్లో ముంబై జట్టుకు అందుబాటులోకి వస్తాడని వార్తలు వస్తున్నాయి. జూన్లో ఐదు టెస్ట్ల సిరీస్ కోసం టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్ కోసమే.. బుమ్రా గాయాన్ని బీసీసీఐ జాగ్రత్తగా పరిశీలిస్తోంది. పూర్తి ఫిట్నెస్ సాధిస్తేనే అతనికి ఐపీఎల్ ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ లభిస్తోంది.